కడుపు మండి చెబుతున్నా.. అది బాబు ప్రోద్బలమే!: ప్రత్యూష కేసుపై ఆమె తల్లి
హైదరాబాద్: చంద్రబాబు హయాం అంతా మహిళలకు వ్యతిరేకమని అన్నారు దివంగత సినీ నటి ప్రత్యూష తల్లి పాదరాజు సరోజినిదేవి. ఏపీ ప్రభుత్వం 'ఆడబిడ్డకు రక్షగా కదులుదాం' కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో దానిపై ఆమె మీడియాతో మాట్లాడారు.
మహిళోద్ధారణ చేస్తానంటూ ఏపీ సీఎం చంద్రబాబు ర్యాలీలు చేయటం విచిత్రంగా ఉందన్నారు సరోజినిదేవి. 2002లో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో.. బాబు ప్రోద్బలంతోనే ఆయన సన్నిహితులు తన బిడ్డపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె ఆరోపించారు.
ఆనాడు తాను న్యాయం కోసం పోరాటం చేస్తే అధికార బలంతో ఏ ఒక్క ఆధారం లేకుండా చేశారని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ తాము సుప్రీంకోర్టులో ఒంటరి పోరు చేస్తున్నామని అన్నారు. ఏపీలో జరిగిన దాచేపల్లి, రిషితేశ్వరి ఘటనలు, విజయవాడలో కాల్మనీ గ్యాంగ్ ఆగడాలు, మహిళలపై అరాచకాల అనంతరం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు, ర్యాలీలు చూసి కడుపు మండి తాను మీడియాతో మాట్లాడుతున్నానని ఆమె అన్నారు.
తన బిడ్డపై అత్యాచారం జరిపి హత్య చేశారని అప్పటి సీఎం చంద్రబాబును కలిసి ఆధారాలు సమర్పించినా... వాటన్నింటిని తారుమారు చేయించారని ఆరోపించారు. ఆనాటి హత్య కేసును తిరిగి విచారించే దిశగా చర్యలు చేపట్టి తమ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు సరోజిని దేవి. సుప్రీంకోర్టులో తమకు తప్పక న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందన్నారామె.