వేడుకకు కేసీఆర్ దూరం: 'జిఎస్టీ సాకుతో ధరలు పెంచొద్దు'
తొమ్మిది రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. శుక్రవారం రాత్రి జరగనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం లేదు.
హైదరాబాద్: తొమ్మిది రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. శుక్రవారం రాత్రి జరగనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం లేదు.
జిఎస్టీ ఎఫెక్ట్, బిల్లు మోత!: మొబైల్ ధరలు పెరుగుతాయా?
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి హాజరు కావడానికి గత బుధవారం రాత్రి ఆయన ఢిల్లీకి వెళ్లారు. కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు వారం పాటు ఉన్నారు. ఆపరేషన్ చేయాలని నిర్ణయించినప్పటికీ 2సార్లు వాయిదా పడింది.
అదే సమయంలో జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎంలందరినీ ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కేసీఆర్ పాల్గొంటారని భావించారు.
ముఖ్యమంత్రులకు ఆహ్వానం లేకనే..
అయితే, ఈ కార్యక్రమానికి కేంద్రం ముఖ్యమంత్రులు ఎవరినీ ఆహ్వానించలేదని తెలుస్తోంది. జిఎస్టీ ప్రారంభోత్సవం కేంద్ర కార్యక్రమంగానే జరగనుందని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ హైదరాబాద్ తిరిగి వచ్చారని సమాచారం.
జిఎస్టీని సాకుగా చూపించొద్దని..
జిఎస్టీని సాకుగా చూపి ధరలు పెంచవద్దని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యాపారులను గురువారం కోరారు. జీఎస్టీపై వ్యాపారులు ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదన్నారు. సామాన్యులు వాడే ఆహార పదార్థాలపై పన్ను లేకపోవడం, లేదంటే తగ్గిందని గుర్తించాలన్నారు. జీఎస్టీలో నమోదుకు వ్యాపారులకు జులై 5 వరకు అవకాశం ఉందన్నారు.
వ్యాపారులు..
రాష్ట్రంలో 2.07 లక్షల మంది వ్యాపారులు ఉండగా ఇప్పటికి 1.7 లక్షల మంది నమోదు చేసుకున్నారని, మరో 25 వేలమంది ట్రేడర్లు నమోదు చేసుకునే అవకాశముందన్నారు. జీఎస్టీ అమలు నేపథ్యంలో ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ఈ పన్నుపై అవగాహన కలిగించేందుకు వాణిజ్య పన్నుల శాఖ సిద్ధంగా ఉందని ఈటెల చెప్పారు.
ఆందోళన వద్దు..
జీఎస్టీపై వ్యాపార వర్గాలు ఆందోళన పడొద్దని, ఏమైనా సందేహాలుంటే నివృతి చేస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో జీఎస్టీని అమలు చేయాల్సి ఉంటుందని, జీఎస్టీ రేట్లపై అభ్యంతరాలు ఉంటే జీఎస్టీ మండలిలో చర్చించుకుని మార్చుకునే అవకాశమంటుందని, జీఎస్టీని సమర్థంగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈటెల చెప్పారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు.
కేంద్రంతో రాజీ లేదు
జీఎస్టీ అంశంలో కేంద్రంతో తాము రాజీపడడం లేదని, జీఎస్టీతో సామాన్యులపై భారం పడకుండా ఉండాలని కేంద్రానికి స్పష్టంగా చెప్పామని ఈటెల చెప్పారు. బీడీ పరిశ్రమ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, చేనేత, సాగునీటి రంగాలకు వస్తు, సేవల పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారన్నారు.