మేడారం జాతరకు కేసీఆర్: అతిపెద్ద పండగకు జాతీయ హోదా కోసం డిమాండ్
ములుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగ సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 16వ తేదీన మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ జాతర ఆరంభమైంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారంలో వెలిసిన వనదేవతలను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. తమ మొక్కులను చెల్లించుకుంటోన్నారు. కుంభమేళా తరువాత ఆ స్థాయిలో భక్తులు దర్శించుకునే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది.
వనదేవతలను దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. పొరుగునే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో పోటెత్తుతున్నారు. భక్తుల రాకతో మేడారం క్రిక్కిరిసిపోయింది. జంపన్నవాగు పరిసరాలు జనమయం అయ్యాయి. ఈ ఏడాది కూడా ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, హన్మకొండ నుంచి మేడారం జాతరకు హెలికాప్టర్ సర్వీసులను ప్రవేశపెట్టింది.

ఇవ్వాళ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మేడారం జాతరకు వెళ్లనున్నారు. సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడారానికి చేరుకుంటారు. సంప్రదాయబద్ధంగా తులాభారం ద్వారా బంగారాన్ని సమర్పిస్తారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్రెడ్డి, అధికారులు ఉంటారు. మూడు గంటల పాటు కేసీఆర్ మేడారం జాతరలో గడుపనున్నారు.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి కూడా ఇవ్వాళే మేడారానికి చేరుకోనున్నారు. ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి- గిరిజన దేవతలను దర్శించుకోనున్నారు. మొక్కులు చెల్లించుకోనున్నారు. వారితో పాటు దాదాపు అన్ని రాజకీయ పార్టీల నాయకులు మేడారాన్ని ఇవ్వాళే దర్శించుకునే అవకాశం ఉంది.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ ఊపందుకుంది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే- జాతీయ హోదా కల్పిస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది కూడా. అటు అధికార టీఆర్ఎస్ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. కేంద్రాన్ని ఒప్పించి- మేడారం జాతరకు జాతీయహోదాను కల్పిస్తామని, ఆ స్థాయిలో గుర్తింపును తీసుకొస్తామని చెబుతోంది.












Click it and Unblock the Notifications