రెండేళ్లు టైమ్ ఇవ్వండి.. టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ ఆఫర్!
విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకువస్తున్నామని.. రెండేళ్లలో టీచర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పదోన్నతులను పూర్తి చేశామని.. టీచర్ల బదిలీల విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ కు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని.. తల్లిదండ్రులకంటే విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దనే ఎక్కువ సమయం గడుపుతారని ఆయన చెప్పారు. రెండేళ్ల సమయం ఇస్తే ఉపాధ్యాయుల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారని.. తమ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. విద్యాభివృద్ధిలో గతంలో 28వ స్థానంలో ఉంటే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 17వ స్థానానికి చేరుకుందని రేవంత్ చెప్పారు. ఇది ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమైందన్నారు. ఈ రెండేళ్లల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 88 వేలు పెరిగారన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో 95 శాతం అడ్మిషన్లు జరిగాయని.. సాంకేతిక విద్యలో తెలంగాణ వేగంగా ముందుకెళుతోందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. " దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. విద్యార్థుల భవిష్యత్ ను తీర్చిదిద్దడానికి సమర్థులైన వారిని యూనివర్సిటీల వీసీలుగా నియమించాం. ఉపాధ్యాయులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. ఉపాధ్యాయులు రోడ్డు మీదకు రావొద్దు.. వారి సమస్యలను పటిష్కరించాలనే ఆలోచనతో నేను ముందుకు వెళుతున్నా. ప్రజా ప్రభుత్వంలో 55 రోజుల్లో డీఎస్సీ ద్వారా 10,006 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసింది నిజం కాదా?. 25,950 టీచర్ల ప్రమోషన్లు పూర్తి చేసింది నిజం కాదా.. ఆలోచించండి. చిన్న వివాదం లేకుండా 34,706 మంది ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా నిర్వహించాం . 317 జీవో సమస్యను పరిష్కరించాం. విద్యా కమిషన్ ఏర్పాటు చేసి మీ సమస్యలను పరిష్కరిస్తున్నాం. కె.కేశవరావును సలహాదారుగా నియమించి విద్యాశాఖ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పాలసీని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం ." అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయ నాయకులకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని.. సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వంపై అభిప్రాయం మార్చుకోవద్దని టీచర్లకు సూచించారు. తాము అధికారంలోకా రాగానే పీఆర్సీ ఇచ్చామన్నారు. "మళ్లీ ఇప్పుడు పీఆర్సీ ఇవ్వాలని శ్రీపాల్ అంటున్నారు. మీ ఉద్యోగ సర్వీస్ 30 ఏళ్లు ఉంటుంది. ఒకే ఒక్క కుటుంబం 8 లక్షల కోట్లు అప్పులు చేసింది. మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా మీ సర్వీస్ ను 60 ఏళ్లకు పెంచారు. మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ పెట్టి వెళ్లి ఆయన ఫామ్ హౌస్ లో పడుకున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రజా ప్రభుత్వం 6 వేల కోట్లు చెల్లించింది
ఎప్పుడైనా ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ ఖర్చులతో విదేశాలకు పంపి విద్యా విధానం అధ్యయనం చేయించారా? తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులను విదేశాలకు పంపించింది నిజం కాదా? ఉపాధ్యాయులకు గుర్తింపు ఇవ్వాలని వారిని గౌరవించాలని 123 మంది టీచర్లకు అవార్డులు అందిస్తున్నాం. నేనే మీ ప్రతినిధిగా సమస్యలను పరిష్కరిస్తా" అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దు: సీఎం రేవంత్ రెడ్డి
రెండేళ్లు డెడికేటెడ్గా విద్యార్థుల కోసం పనిచేయాలని టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దేశ విద్యావ్యవస్థకు దిక్సూచీగా తెలంగాణను తీర్చిదిద్దుదామని పేర్కొన్నారు. మనం చేస్తున్న మంచి పనులపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. "విద్యా శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. రెండేళ్లు నాకు సమయం ఇవ్వండి.. ఆర్ధిక వెసులుబాటునుబట్టి మీ సమస్యలు పరిష్కరిస్తా. టీచర్లు రోడ్డెక్కితే రాష్ట్రానికి శుభసూచకం కాదు రెండేళ్ల తరువాత మీరు ఆశించినట్లుగా సమస్యలు పరిష్కరించకుంటే.. ఎన్నికల పరీక్షలో ఎన్ని మార్కులు వేయాలో మీరే నిర్ణయించుకోండి. పిల్లల భవిష్యత్కు ఏది మంచిదో చూడండి. ప్రైవేటుగా ధీటుగా నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. రాజకీయ నాయకుల ఉచ్చులో పడకండి. పదేళ్లు విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారు. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపిద్దాం . అది మీ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. మీకు ఉపాధ్యాయులకు ఎలాంటి చిన్న సమస్య కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాది. పాలిటెక్నిక్ విషయంలో జరుగుతున్న అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దు. మిమ్మల్ని అడ్డుపెట్టుకుని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారు. దయచేసి అలాంటివారి ట్రాప్ లో పడొద్దు" అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.













Click it and Unblock the Notifications