సమగ్ర కుల కుటుంబ సర్వే వివరాలు నమోదు చేసుకున్న సీఎం రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సమగ్ర కుటుంబ కుల సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు ఈ సర్వే పూర్తయింది. తాజాగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల సర్వేలో తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు. సీఎం రేవంత్ కుటుంబ వివరాలను ఎన్యుమరేటర్, అధికారులు నమోదు చేశారు.
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, జీహెచ్ఎంసీ కమీషనర్ ఇలంబర్తి, ఇతర అధికారులు, ఎన్యుమరేటర్లు, సిబ్బందితో కూడిన సర్వే బృందం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు నమోదు చేయించుకున్నారు.

సర్వే పురోగతి వివరాలను, సర్వేలో పాల్గొన్న ప్రజల స్పందన గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. వీలైనంత త్వరగా కుల సర్వే పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా సర్వేలో వివరాలు నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ పరిధిలో వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా, కులగణన సర్వే బుధవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 95 శాతం పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం ఇప్పటి వరకు 1,18,02,726 నివాసాలను గుర్తించారు.
బుధవారం నాటికి 1,10,98,360 నివాసాలలో సమాచార సేకరణ పూర్తవగా.. కేవలం 7,04,366 నివాసాల సర్వే సమాచారాన్ని మాత్రమే సేకరించాల్సింది ఉంది. సేకరించిన సమాచారాన్ని అధికారులు జాగ్రత్తగా కంప్యూటరీకరించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు, ఈ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications