ఓటమినుండి తేరుకుంటున్న కాంగ్రెస్ నేతలు..! గెలుపోటములు సహజం అంటున్న షబ్బీర్ ఆలీ..!!
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులు ఓటమి మిగిల్చిన విషాదం నుండి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఓటమితో మరింత క్రుంగి పోకుండా బాదనంతా దిగమింగుకుని మెల్లమెల్లగా జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, ఓడినా ప్రజాలపక్షాన నిలబడతామని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పార్టీ మారినందుకు ఆయనపై అనర్హత వేటు వేయాలని పిర్యాదు చేస్తున్నామన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం దామోదర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
ఫిరాయింపులపై షబ్బీర్ ఆలీ సీరియస్..! ఇకనైనా టీఆర్ఎస్ ఫిరాయింపులను ఆపాలని డిమాండ్.!!
కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రజాప్రతినిదుల పిరాయింపులను ప్రోత్సహించారన్నారు. దేశంలో ఇంత పెద్దఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించిన సీఎం గా కేసీఆర్ నిలిచిపోతారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లపై వేటు వేయాలని గత నాలుగేళ్లుగా మేము ఎన్నిసార్లు పిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ప్రజాస్వామ్యంలో గెలుపోటములు కామన్..! క్రుంగి పోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్య..!!
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ లపై టీఆర్ఎస్ పిర్యాదు చేయగానే చర్యలు ప్రారంభమైయ్యాయన్నారు. ఇంత పక్షపాత ధోరణి అన్యాయమన్నారు. మీకు ఒక చట్టం .. మాకు ఒక చట్టమా అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా దామోదర్ రెడ్డి, ఎం.ఎస్ ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ విధానాలపై విమర్శలు మొదలు పెట్టిన కాంగ్రెస్..! పథకాలు పక్కాగా అమలు చేయాలని సూచన.!
కేసీఆర్ పింఛన్ పెంపు బడ్జెట్ తరువాత అనడం ప్రజలను మోసం చేయడమే. ఉద్యోగులకు రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు పై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. జనవరి నుంచే ఈ హామీలను నెరవేర్చాలి. లక్ష రుణమాఫీ ఏకకాలంలో చెయ్యాలి. కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన హామీపై తొలి సంతకం పెట్టారు. ఇది కాంగ్రెస్ క్రెడిబులిటీ .. కేసీఆర్ క్రెడిబులిటీ కూడా నిలబెట్టుకోవాలి. పంచాయితీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 22 శాతానికి తగ్గించడం అన్యాయమని అన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయాలి..! ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలంటున్న కాంగ్రెస్.!
ఇదే అంశంలో సుప్రీం కోర్టు లో ప్రభుత్వం ఎందుకు స్పెషల్ లీవ్ పిటీషన్ వేయలేదని ప్రశ్నించారు. ఈ చర్యవల్ల దాదాపు వెయ్యి మంది బీసీలు సర్పంచు అయ్యే అవకాశం కోల్పోతారు. అలాగే తొమ్మిది వేల మంది బీసీలు వార్డు మెంబర్లు అయ్యే అవకాశం కోల్పోతారు. ఈవీఎం లల్లో ఏదో గందరగోళం జరిగిందనే అనుమానం మాకు ఉంది. లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ తో పొత్తు ఉండాలా వద్దా అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని షబ్బీర్ అలీ తెలిపారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పరాభవం తర్వాత కాంగ్రెస్ నేతలు ఇప్పడిప్పుడే బాహ్యప్రపంచంలోకి రావడం కొసమురుపు.