వైద్యులకు కరోనా కష్టాలు .. బాధితులకు వైద్యం చెయ్యటమే పాపమా ?
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికించటమే కాదు కరోనా పాజిటివ్ బాధితులకు సేవలు చేస్తున్న వైద్యులకు పుట్టెడు కష్టాలు తెచ్చిపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్యులు కరోనా బాధితులకు సేవ చేయలేని దుస్థితి నెలకొంది. ఒకపక్క ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు బయట సమాజంలో మాత్రం రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్స్ కు చికిత్స అందిస్తున్న వైద్యులను ఇళ్ళు ఖాళీ చేయమని ఇంటి ఓనర్ లు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది.

కరోనా బాధితులకు సేవ చేసే వైద్యుల ఇళ్ళు ఖాళీ చేయిస్తున్న ఓనర్లు
ఇక హైదరాబాద్లోనూ గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులకు అపార్ట్మెంట్లలోనూ, బయట కూడా ఇబ్బంది ఎదురవుతుంది. కరోనా బాధితులకు వైద్యం చేస్తున్న కారణంగా వారిని గృహ సముదాయాల్లో ఉండ వద్దు అని చెప్తున్న ఓనర్ లు వారి వల్ల తమకు కరోనా వస్తుందేమో అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ పట్ల అవగాహన కోసం, వ్యక్తిగత శుభ్రత పాటించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ ఉంటే, వైద్యులను దేవుళ్లుగా అభివర్ణిస్తుంటే అటువంటి వైద్యులను తాము నివసించే ప్రాంతాలలో ఉండవద్దని చెప్పటం, వారిని కూడా కరోనా పేషెంట్స్ లాగా ట్రీట్ చేయడం వైద్యులను చాలా ఆవేదనకు గురి చేస్తుంది.

కరోనా బాధితులకు సేవ ఎఫెక్ట్ .. హౌస్ సర్జెన్ లు సామాజిక వెలి
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో గాంధీ ఆస్పత్రిలో పని చేస్తున్న హౌస్ సర్జెన్ లు , వరంగల్ లో ఎంజీఎం లో పని చేస్తున్న హౌస్ సర్జన్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు చికిత్స చేసినందుకు వారిని సోషల్ బాయ్ కాట్ చేస్తున్న పరిస్థితి వైద్యులకు తలనొప్పిగా మారింది. చాలామంది ఇంటి యజమానులు నిర్దాక్షిణ్యంగా వైద్యులను ఇళ్ళు ఖాళీ చేయించడంతో వైద్యులు రోడ్ల మీద నిలబడిన పరిస్థితి.

ఐసోలేషన్ వార్డులుగా అన్నీ మెడికల్ కాలేజీల క్యాంపస్ లు
మరోపక్క మెడికల్ కళాశాలలకు సంబంధించిన క్యాంపస్ లను ఖాళీ చేయించి వాటిని ఐసోలేషన్ వార్డులుగా వినియోగించడం కూడా వైద్యులకు ఇబ్బందికరంగా మారింది .
రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ వైద్యులు ,ఎలాంటి రక్షణ లేకుండా కరోనా వైరస్ మహమ్మారి తో పోరాటం చేస్తున్నా , శెలవు తీసుకోకుండా పని చేస్తున్నా వైద్యుల పట్ల అటు ప్రభుత్వాలలో కానీ, ఇటు ప్రజల్లో కానీ నిజమైన కృతజ్ఞత భావం కనిపించటం లేదని లబోదిబోమంటున్నారు.

డాక్టర్లకు కనీస సదుపాయాలు కల్పించటంలో ప్రభుత్వాలు ఫెయిల్
జనతా కర్ఫ్యూ నాడు మాత్రమే సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టి, గంటలు మోగించి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రజలు , ప్రస్తుతం కరోనా వైరస్ బారినపడి ప్రాణాల కోసం పోరాటం చేస్తున్న బాధితులను ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్న డాక్టర్లను సామాజికంగా వెలివేయడం డాక్టర్లను ఆవేదనకు గురి చేస్తుంది. అంతేకాదు ప్రభుత్వం డాక్టర్లకు కావాల్సిన కనీస వసతులు కల్పించి వారి సేవలను వినియోగించుకోవాల్సిన ప్రభుత్వం డాక్టర్ల సమస్యపై స్పందించటం లేదు .

ప్రభుత్వాలు, ప్రజలు వైద్యులకు సహకరించాలి
ఇలాంటి క్లిష్ట సమయంలో వైద్యం చేయని డాక్టర్లను నిర్దాక్షిణ్యంగా రిజైన్ చేసి వెళ్ళిపొమ్మని చెప్తున్న ప్రభుత్వాలు స్పందించాలి. ధన్వంతరి వారసులుగా, ప్రస్తుతం ప్రజల ప్రాణాలు రక్షించడానికి వచ్చిన దేవుళ్ళు గా భావిస్తున్న వైద్యులకు సరైన సదుపాయాలు అందించి వారి సేవలను మానవాళికి ఉపయోగపడేలా చేయాలి. ఇక ప్రజలు సైతం మన ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వైద్యులను సామాజికంగా వెలి వేయకుండా , వారి గొప్పతనాన్ని అర్థం చేసుకొని సహకరించాలి.












Click it and Unblock the Notifications