కరోనా సోకిన కేసీఆర్తో చెట్టాపట్టాల్ -సీఎం కుటుంబీకుడికీ వైరస్ -ఎంపీ సంతోష్ కుమార్కు పాజిటివ్
తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోందనడానికి సంకేతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వైరస్ బారినపడటం తెలిసిందే. ఇప్పుడాయన కుటుంబీకుడికి సైతం కరోనా సోకింది. సీఎం కేసీఆర్ కు ఆప్తుడైన సమీప బందువు, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దురదృష్టవశాత్తు తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఎంపీ సంతోష్ కుమార్ గురువారం ట్విటర్ వేదికగా స్వయంగా వెల్లడించారు. అయితే, లక్షణాలేవీ లేకుండానే తనకు కొవిడ్ నిర్ధారణ అయిందని, వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ఎంపీ తెలిపారు. ప్రజలెవరైనా బయటకు వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఎంపీ సూచించారు.
కేసీఆర్ కు మూడు రోజుల కిందట కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత కూడా ఎంపీ సంతోష్ సీఎంకు అత్యంత సన్నిహితంగా మెలగడం, బుధవారం పలు టెస్టుల కోసం సీఎం ఆస్పత్రికి వచ్చిన సమయంలోనూ ఎంపీ సంతోష్ వెన్నంటే ఉండటం తెలిసిందే. కరోనా సోకిన కేసీఆర్ కు ఎంపీ అంత దగ్గరగా మసలడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆస్పత్రిలో సీఎం వెంట మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు.
కరోనా విలయం: ఎన్నికలు యథాతథం -కేసీఆర్ సర్కారు పట్టు, ఎస్ఈసీ ప్రకటన -రద్దుకు హైకోర్టు నో చెప్పడంతో
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం ప్రకటించిన లెక్కలను బట్టి రాష్ట్రంలో కొత్తగా 5,567 కేసులు, 23 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,73,468కి, మొత్తం మరణాలు 1899కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 49,781 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా ఉధృతి ఉన్నప్పటికీ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసేందుకు హైకోర్టు నో చెప్పడంతో షెడ్యూల్ ప్రకారం ఈనెల 30న రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు యథాతథంగా జరుగనున్నాయి.