అంతా అయోమయమే.!నివురుగప్పిన నిప్పులా నగరం.!హైదరాబాద్ లో కరోనా ప్రమాద ఘంటికలు.!
హైదరాబాద్ : కరోనా వైరస్ విజృంభన గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్నహెచ్చరికలతో ప్రపంచ దేశాలు మళ్లీ ముందస్తు జాగ్రత్తల దిశగా అడుగులు వేస్తున్నాయి. జూన్ రెండు, మూడు వారాల్లో భారత దేశంలో కూడా కరోనా పంజా విసురుతుందనే హెచ్చరికలను డబ్ల్యూహెచ్ఓ జారీ చేస్తోంది. ఈ సందర్బంగా ప్రమాదకర పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం ఉన్నట్టు తెలుస్తోంది.
లాక్డౌన్ ఆంక్షల నుండి అనేక సడలింపులు ప్రకటించిన నేపథ్యంలో నియంత్రణ లేకుండా పోయందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాలు ఎప్పటిలాగానే ముందుస్తు జాగ్రత్తులు పాటించకుండా రోడ్ల మీదకు రావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో నగరం నివురుగప్పిర నిప్పులా మారిందనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదపు అంచున హైదరాబాద్ నగరం..
హైదరాబాదులో కరోనా ప్రమాదకరమైన స్తాయిలో విస్తరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకు అనేక అంశాలు సాక్షాలుగా నిలుస్తున్నాయి. ఇంతకాలం నగర ప్రజలు ఎంత భయంతో కాలం నెట్టుకొచ్చారో అంతకు రెట్టింపు భయాన్ని ప్రస్తుత పరిస్తితులు కల్పిస్తున్నాయి. అంతే కాకుండా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ విస్తరణ శాతంలో హైదరాబాద్ నగరం ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. లాక్డౌన్ లో ఉన్నపుడు రెడ్ జోన్ల వారికే కరోనా సోకే ప్రమాదం ఉండగా ప్రస్తుత సడలింపులతో నగర ప్రజలు అన్ని ప్రాంతాలకు తిరుగుతున్నారు. దీంతో ఎక్కడైనా కేసులు బయటపడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అందుకే గతంలో కంటే ఇపుడే ఎక్కువ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నగర ప్రజల్లో కనిపిస్తోన్న నిర్లక్ష్యం..
హైదరాబాదులో కరోనా వ్యాప్తి విషయంలో దారుణమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. లాక్డౌన్ తర్వాత జిల్లాల్లో మళ్లీ కరోనా కేసులు ఎలాగైతే పెరిగాయో, అదే మాదిరిగా హైదరాబాదులో కూడా విస్తరిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అంచనాకు మించిన కేసులు నమోదవుతున్నాయి. లాక్డౌన్ ఆంక్షల సడలింపులే దీనికి ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వంద మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే అందులో దాదాపు పది మందికి కరోనా నిర్ధారణ అవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో సెకండరీ కాంటాక్టులకు కరోనా లక్షణాలు ఉంటే తప్ప పరీక్షలు చేయడం లేదు. కరోనా తొలి నాళ్లలో ఎంతో సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇపుడు పరీక్షల అంశంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.

సీరియస్ గా టెస్టులు నిర్వహిస్తే మరిన్ని కేసులంటున్న వైద్యులు..
కరోనా టెస్టులు అంతంత మాత్రమే.. సీరియస్ గా టెస్టులు నిర్వహిస్తే మరిన్ని కేసులంటున్న వైద్యులు..
అత్యంత ఆశ్చర్యకర అంశం ఏంటంటే 80 శాతం మందిలో లక్షణాలు కనిపించకపోవడం అతిపెద్ద ప్రమాదకర పరిణామంగా చర్చ జరుగుతోంది. కరోనా వైరస్ ప్రభావం అంతగా చూపకముందు నగర ప్రజలందరూ ఎంత స్వేఛ్చగా తిరిగారో ప్రస్తుత కరోనా ప్రమాద ఘంటికల నేపథ్యంలో కూడా అందరూ అలాగే యథేచ్ఛగా రోడ్ల మీద విహరిస్తున్నారు. మాస్క్ వేసుకోవడం, శానిటైజర్ వెంట పెట్టుకోవడం, ఇతరులకు దూరంగా ఉండి మాట్లాడటం ద్వారా మాత్రమే కరోనా మహమ్మారి నుండి బయట పడగలం. అనివార్యం అయితే తప్ప ఇతరులను కలవకపోవడం మంచిది. అంతే కాకుండా అప్పడాల ప్యాకెట్ కోసం ఆబిడ్స్ వెళ్లే అలవాటు మానుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నివురుగప్పిన నిప్పులా నగరం.. ఎవరిలో కరోనా ఉందో చెప్పలేని పరిస్ధితులు..
అంతే కాకుండా ఒక అంచనా ప్రకారం హైదరాబాదులో అనుమానితులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తే కనీసం లక్ష కేసులు బయటపడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. ఇమ్యునిటీ ఉన్నవారికి కరోనా సోకడం, కరోనా సోకినట్టు కూడా తెలియడం లేదంటున్నారు వైద్యులు. కానీ వారిలో కరోనా ఉన్న సమయంలో మరికొందరికి వ్యాపింపజేయడం శోచనీయమని చర్చ జరుగుతోంది. అందుకే ఎవరికి వారు ఇతరులకు దూరంగా ఉండటం ద్వారానే తమను తాము రక్షించుకోగలరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాదులో 31 మంది డాక్టర్లకు కరోనా సోకిందంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో, కరోనా ఎంత విజృంభించే స్దాయిలో ఉందో, నగరం ఎంత నివురుగప్పిన నిప్పులా ఉందో అంచనా వేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications