రేపు అన్నీ చెప్తారు: తలసానితో దానం నాగేందర్ భేటీ, వరుస షాక్లు.. అదే దారిలో ముఖేష్?
Recommended Video
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తెలంగాణ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ శుక్రవారం సాయంత్రం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో భేటీ అయ్యారు. ఇప్పటికే ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన అధికార టీఆర్ఎస్లోకి వెళ్తారని భావిస్తున్నారు. రాజీనామా చేసిన కాసేపటికే ఆయన తలసానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్కు భారీ షాక్: దానం నాగేందర్ రాజీనామా, టీఆర్ఎస్ పార్టీలోకి?
దీనిపై తలసాని మాట్లాడుతూ.. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తుందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. రేపు దానం అన్ని వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. టీఆర్ఎస్లోబలహీన వర్గాలగే ప్రాధాన్యత ఉందన్నారు.
దానం పార్టీ వీడటం నష్టమే, ఉత్తమ్ ఫోన్ చేసినా..
దానం నాగేందర్ పార్టీ వీడటం బాధాకరమేనని, నష్టమేనని పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. తనకు అన్ని విషయాలు తెలియవని చెప్పారు. పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. ఆయన తమకు అందుబాటులో లేరన్నారు. అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి దానంతో మాట్లాడారు. కానీ ఆయన చల్లబడనట్లుగా తెలుస్తోంది. జానా నివాసంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అయ్యారు.
దానం దారిలోనే ముఖేష్ గౌడ్, విక్రమ్ గౌడ్
దానం నాగేందర్ దారిలోనే హైదరాబాద్ నగరానికి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముఖేష్ గౌడ్, ఆయన తనయుడు విక్రమ్ గౌడ్ నడవనున్నారనే ప్రచారం సాగుతోంది. వారు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరే అవకాశముందని అంటున్నారు.
దానం రాజీనామాకు గల కారణాలివే
దానం అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికీ పంపించారు. శనివారం మీడియాతో మాట్లాడి అన్ని వివరాలు వెల్లడించనున్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న దానం తాజాగా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. పార్టీ పదవుల పంపకం విషయంలో రాష్ట్రానికి సంబంధించి విస్తరిస్తారని, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తనను నియమిస్తారనే ఆశతో ఆయన ఎదురు చూశారు. అంతేకాకుండా ఆ పదవి కోసం ఆయన ప్రయత్నించినప్పటికీ సానుకూల ప్రకటన రాలేదు దీంతో పార్టీ వీడారని తెలుస్తోంది.
ఆ రోజే చేరుతారని వినిపించినప్పటికీ
అలాగే, కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్న తనకు చెప్పకుండానే ఆ పదవిని అంజన్ కుమార్ యాదవ్ను అప్పగించారని, అదంతా తనకు తెలియకుండానే జరిగిపోయిందని వాపోతున్నారని తెలుస్తోంది. గతంలో రిపబ్లిక్ వేడుకల సందర్భంగా రాజ్ భవన్లో జరిగిన గవర్నర్ విందును కాంగ్రెస్ బహిష్కరించింది. దీనికి దానం హాజరయ్యారు. అప్పుడే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. కానీ అప్పుడు ఆరోపణలను ఖండించారు. గవర్నర్తో తనకున్న సాన్నిహిత్యం కారణంగానే ఆ విందుకు హాజరైనట్లు తెలిపారు.