అద్దె ఇంట్లో నివాసం: ఇల్లు లేక రోడ్డు పక్కనే శవం
హైదరాబాద్: అద్దె ఇంట్లో నివాసం ఉంటే వారి దైన్య పరిస్థితికి అద్దం పట్టే సంఘటన ఒకటి ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పాత నుస్తులాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. నుస్తులాపూర్కు చెందిన ఎన్నం రాజిరెడ్డి తమ గ్రామం ఎల్ఎండీలో మునిగిపోవడంతో 35 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా రామకృష్ణ కాలనీకి వచ్చారు.
అనంతరం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్కు వచ్చారు. రాజిరెడ్డికి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. రాజిరెడ్డి కొడుకు సత్తిరెడ్డి, కూతురు పటాన్చెరువులో కూలీ పనులు చేసుకుంటూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం సత్తిరెడ్డితో పాటు తల్లి సారమ్మ అనారోగ్యానికి గురైంది.
శనివారం సాయంత్రం సత్తిరెడ్డి మృతిచెందగా, శవాన్ని తీసుకెళ్లాలని పటాన్చెరువు ఇంటి యజమాని అంబులెన్స్ని మాట్లాడి పంపించారు. దీంతో దిక్కులేని స్థితిలో రాజిరెడ్డి తన కొడుకు శవంతో ఆదివారం రామకృష్ణ కాలనీకే చేరుకున్నాడు.
రామకృష్ణ కాలనీలో తన సోదరుడు లక్ష్మారెడ్డి ఉంటున్నా అతనికి ఇల్లు లేకపోవడంతో శవాన్ని ఎవరి ఇంటికి తీసుకెళ్లాలనే సమస్య వచ్చింది. దీంతో రాజిరెడ్డి బంధువు బాపురెడ్డి, స్థానికుడు దావు సంపత్రెడ్డిలు మృతదేహాన్ని రోడ్డుకు పక్కగా ఉన్న చెట్టు కింద పడుకోబెట్టారు.
గ్రామస్తుల సాయంతో పాటు మొలంగూర్లో ఉంటున్న రాజిరెడ్డి బంధువులు ఆర్ధికసాయం అందించారు. దీంతో కొడుకు సత్తిరెడ్డి అంత్యక్రియలను పూర్తి చేశారు. అనంతరం రాజిరెడ్డి కుటుంబానికి రామకృష్ణ కాలనీలోనే ఉంటున్న ఆయన బంధువు బాపురెడ్డి ఆశ్రమిచ్చాడు.