బీఆర్ఎస్కు స్టాలిన్ ఆహ్వానం.. హాజరవుతానన్న కేటీఆర్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో మార్చి 22న చెన్నైలో నిర్వహించబోతున్న సమావేశానికి బీఆర్ఎస్ను ఆహ్వానించారు డీఎంకే నేతలు. హైదరాబాద్ వచ్చిన డిఎంకే నేతలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ, నీటి సరఫరా మంత్రి కె.ఎన్. నెహ్రూ, రాజ్యసభ ఎంపీ ఎన్.ఆర్. ఎలాంగో బృందంతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశమయ్యారు. అనంతరం రెండు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సమష్టిగా పోరాడినట్లయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

1970-80 దశకంలో ఫ్యామిలీ ప్లానింగ్ బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ స్థానాలను కొత్తగా వచ్చిన సెన్సెస్ ప్రకారం నిర్ణయిస్తాం అనడం అన్యాయం. ఫలితంగా పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. ఈ విషయంలో స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరఫున హాజరు కావాలని కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ ఆదేశం ప్రకారం మార్చి 22న జరిగే సమావేశానికి హాజరై బీఆర్ఎస్, తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీఎంకే నేతలు మాట్లాడుతూ.. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారని తెలిపారు.
అందుకే మార్చి 22న దక్షిణాదిలోని అన్ని పార్టీలతో చెన్నైలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారని డీఎంకే నేతలు చెప్పారు. ఆ సమావేశంలో అన్ని పార్టీలతో చర్చించి ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తాం. ఆ సమావేశానికి హాజరు అవుతామని బీఆర్ఎస్ చెప్పిందన్నారు డీఎంకే నేతలు. ఇందుకు బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications