వేయిస్తంభాల గుడికి త్వరలో పూర్వ వైభవం: రాజధానిలో సమావేశం
వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పునరుద్ధరణ పనులు పునః ప్రారంభమయ్యేలా చూడడానికి డిసెంబర్ 20న హైదరాబాద్లో కేంద్ర పురావస్తుశాఖ అధికారులతో సమావేశం జరుగనుంది.
వరంగల్: నగరలోని వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పునరుద్ధరణ పనులు పునః ప్రారంభమయ్యేలా చూడడానికి డిసెంబర్ 20న హైదరాబాద్లో కేంద్ర పురావస్తుశాఖ అధికారులతో సమావేశం జరుగనుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావు చొరవతో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జామ్వాల్తోపాటు రాష్ట్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్, జిల్లా పురావస్తు అధికారులు హాజరుకానున్నారు.
ఆరు నెలలుగా నిలిచిపోయిన మండపం పునరుద్ధరణ పనులు తిరిగి ప్రారంభమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చిస్తారు. పనులను నిర్వహిస్తున్న స్తపతి శివకుమార్కు చెల్లించాల్సిన సుమారు రూ. కోటి బిల్లుల చెల్లింపుపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కల్యాణమండపం పునర్నిర్మాణం పనులు మొదలుపెట్టి దాదాపు పదేళ్లు కావస్తోంది. కేంద్ర పురావస్తు శాఖ అనుసరిస్తున్న ఉదాసీన వైఖరితో నిధులు సకాలంలో అందక పనులు నత్తనడకగా సాగుతూ వస్తున్నాయి. రూ. 7.50 కోట్ల అంచనా వ్యయంతో మండలప పునర్నిర్మాణ పనులను చేపట్టారు. ఇప్పటి దాకా రూ. 6 కోట్ల దాకా ఖర్చయింది. పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయి.
ఆరు నెలలుగా నిలిచిన పనులు
తనకు రావాల్సిన రూ. కోటి బిల్లును కేంద్ర పురావస్తు శాఖ చెల్లించకపోవడంతో స్థపతి శివకుమార్ ఆరునెలలుగా పనులు నిలిపివేశారు. ఈ బిల్లు చెల్లింపుపై స్థపతికి, కేంద్ర పురావస్తుశాఖ అధికారులకు మధ్య వివాదం నడుస్తోంది. పనుల నిర్వహణకు కేంద్ర పురావస్తుశాఖ సమకూర్చిన క్రేన్ పాతది కావడంతో అది పనిచేయక మూలనపడింది. మరో క్రేన్ను సమకూర్చాల్సిందిగా స్థపతి అధికారులను కోరారు. అయినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పనులు నిలిపివేయడంతో దిగివచ్చిన అధికారులు స్థపతికి క్రేన్ను సమకూర్చుకోమన్నారు. ఇందుకు అవసరమైన బిల్లులు చెల్లిస్తామని ఒప్పుకున్నారు. ఈ మేరకు స్థపతి శివకుమార్ రెండు క్రేన్లను ఉపయోగించారు.
శాండ్బాక్స్ టెక్నాలజీ ఆధారంగా నిర్మించిన పునాదిపై స్తంభాలను ఒక్క అంగుళం కూడా తేడా లేకుండా పూర్వలాగే తిరిగి నిలబెట్టారు. ఇక ఈ స్తంభాలపై అడ్డం బీమ్లను అమర్చి దానిపై కప్పును ఏర్పాటు చేయాలి. కీలకమైన ఈ పనులు మొదలు పెట్టడానికి ముందు, క్రేన్లను ఉపయోగించినందుకు వాటి అద్దె కింద రావలసిన రూ. కోటిని చెల్లించాలని స్థపతి కోరారు. అయితే కేంద్ర పురావస్తు అధికారులు ఇందుకు నిరాకరించారు. నిబంధనలు ఒప్పుకోవని తేల్చి చెప్పారు.
అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో స్థపతి పనులను నిలిపివేశారు. దీంతో దిగివచ్చిన అధికారులు బిల్లుల చెల్లింపు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ నెల క్రితం మండప పనులను పరిశీలించి వెళ్లింది. నివేదికను సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై పురావస్తుశాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మళ్లీ టెండర్లు...
బిల్లుల చెల్లింపు సంగతి అటుంచితే ఇప్పుడు మరో సమస్య వచ్చిపడింది. మండపం పైకప్పులో ఉపయోగించే అడ్డం స్తంభాల్లో కొన్ని పూర్తిగా విరిగిపోయాయి. ఇంకొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి స్తంభాల్లో కొన్నింటిని గ్రాఫ్టింగ్ ద్వారా తిరిగి అతికించి వినియోగంలోకి తీసుకురావచ్చు. పూర్తిగా దెబ్బతిన్న స్తంభాల స్థానంలో కొత్తవాటిని చెక్కాల్సిన అవసరం ఉంది.

ఇదే కీలకమైన పని ఈ స్తంభాలను చెక్కే పనిని స్థపతి ద్వారా కొనసాగించకుండా బయిటి వ్యక్తులకు లేదా ఏదైనా నిర్మాణ సంస్థకు అప్పగించేందుకు గ్లోబల్ టెండర్లు పిలవాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే వరంగల్ జిల్లా ఇన్ాక్ కన్వీనర్ పాండురంగారావు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఇలా చేయడంతో పనుల్లో జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
డైరెక్టర్ జనరల్ సుముఖత..
మండపం పనులు 80 శాతం పూర్తయిన తర్వాత మిగిలిన 20 శాతం పనులకు టెండర్లు పిలిచి మళ్లీ ఎవరో కొత్తవారికి అప్పగిస్తే సమన్వయం కుదరకపోవడంతోపాటు, పనుల్లో జాప్యం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని పాండురంగారావు నెల క్రితం ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర పురావస్తుశాఖ డైరెక్టర్ జనరల్ దృష్టికి తీసుకెళ్లారు. స్థపతికి బకాయిపడిన బిల్లు చెల్లించి మిగిలిపోయిన పనిని ఆయనతోనే చేయించాలని సూచించారు. ఇందుకు డైరెక్టర్ జనరల్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు నిర్ణయాలు జరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. వేయిస్తంభాల గుడి పనులు సకాలంలో పూర్తయితే పర్యాటక ప్రాశస్త్యాన్ని మరింత ఇనుమడించుకునే అవకాశాలు ఉన్నాయి.
20న హైదరాబాద్లో సమావేశం
డిసెంబర్ 20వ తేదీన హైదరాబాద్లో పురావస్తుశాఖ అధికారులు సమావేశం అవుతున్నారు. మండపం పనులపై ప్రధానంగా జరుగుతున్న ఈ భేటీకి గతంలో హైదరాబాద్లో సూపరింటెండెంట్గా పనిచేసి పదోన్నతిపై కేంద్ర పురావస్తుశాఖ డైరెక్టర్ అయిన జామ్వాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో స్థపతికి బిల్లు చెల్లింపు, కొత్త టెండర్లు పిలువకుండానే మిగిలిపోయిన 20 శాతం పనుల పూర్తికి తుది నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది. ఇదే జరిగితే త్వరలోనే మండపం పైకప్పు పనులు మొదలవుతాయి. కేంద్ర పురావస్తుశాఖ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా సూపరింటెండెంట్ను నియమించే అంశం కూడా సమావేశంలో చర్చకు రావచ్చునని తెలుస్తోంది.
ఎంపీ దయాకర్ చొరవ అవసరం
వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ చొరవ తీసుకుంటే పనులు ఈ పాటి పూర్తయ్యేవన్న అభిప్రాయం పురావస్తు శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ పనుల గురించి ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఆయన ఎంపీగా ఎన్నికైన తర్వాత ఇప్పటి వరకువేయిస్తంభాల గుడిని సందర్శించలేదు. కనీసం ఢిల్లీలో కూడా పురావస్తు అధికారులతో చర్చించలేదు. మండప పనుల సత్వర పూర్తికి లేఖ రాస్తే కదలిక వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రెండు రోజుల క్రితం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ గుడిని సందర్శించినప్పుడు మండపం పరిస్థితిని స్వయంగా చూశారు. పదేళ్లవుతున్నా పూర్తికాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్వర పూర్తికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీతో లేఖ రాయిస్తానన్నారు. అవసరమైతే ఎంపీతో కలిసి తాను ఢిల్లీకి వెళ్లి కేంద్ర పురావస్తు శాఖ అధికారులతో చర్చిస్తానన్నారు.












Click it and Unblock the Notifications