కెసిఆర్కు సేవల గుర్తింపు: ఖమ్మం మేయర్గా డా. పాపాలాల్?, సొంతగూటికి రెబల్స్
ఖమ్మం/వరంగల్: ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమతి.. సొంతంగానే మేయర్ పీఠాన్ని దక్కించుకోనుంది. ఈ పదవి ఎస్టీ జనరల్కు రిజర్వు కావడంతో ఆ స్థానంలో ఎవరుంటే బాగుటుందనే దానిపై టిఆర్ఎస్ నేతల్లో చర్చ మొదలైంది.
కాగా, రెండో డివిజన్ నుంచి గెలుపొందిన డాక్టర్ గుగులోత్ పాపాలాల్ మేయర్గా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఖమ్మం ప్రధాన ఆస్పత్రిలో టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ఉన్న సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్గా పాపాలాల్ ఆయనకు సేవలు అందించారు.
ఆ గుర్తింపు ఇప్పుడు డా. పాపాలాల్కు కీలకమైన పదవిని పొందేందుకు దోహదపడనుందని సమాచారం. దాదాపు ఆయనే ఖమ్మం నగర మేయర్ అవుతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఆ ఎనిమిది మంది టిఆర్ఎస్ రెబల్స్ మళ్లీ సొంతగూటికే?
గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపొందిన టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు(స్వతంత్రులు) 8 మంది తిరిగి సొంత పార్టీ గూటికే చేరనున్నట్లు సమాచారం. మొత్తం 58 డివిజన్లకు గాను టిఆర్ఎస్ నుంచి 579 మంది నామినేషన్లు వేశారు.
పార్టీ నేతలు 500 మందిని పోటీ నుంచి తప్పుకునేలా చేయగలిగినా దాదాపు 20 మంది తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. వీరిలో 8 మంది విజయం సాధించారు. వీరంతా తిరిగి టిఆర్ఎస్ పార్టీలోకే వస్తారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆయా అభ్యర్థులు కూడా తాము గెలిచిన తర్వాత మళ్లీ సొంతగూటిలోకి వెళ్తామనే చెప్పుకున్నారు. ఈ 8మంది టిఆర్ఎస్లోకి వస్తే.. ఆ పార్టీ బలం 52కు చేరనుంది.