హైదరాబాద్లో దారుణం... రూ.70వేలకు పసిబిడ్డను అమ్మేసిన తాగుబోతు తండ్రి...
హైదరాబాద్లో దారుణం జరిగింది. నెల రోజుల వయసున్న ఓ పసిగుడ్డును కన్నతండ్రే రూ.70వేలకు అమ్మేశాడు. మద్యం మత్తులో బిడ్డను అమ్మేసిన ఆ వ్యక్తి భార్యతో ఈ విషయం చెప్పలేదు. దీంతో బిడ్డ కనిపించట్లేదని తల్లడిల్లిన ఆ తల్లి అక్కడా,ఇక్కడా అన్నిచోట్లా వెతికింది. కానీ లాభం లేకపోయింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమె భర్తే తమ బిడ్డను అమ్మేసినట్లు తేలింది.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్లోని మలక్పేట నల్గొండ చౌరస్తా సమీపంలోని ఓ చర్చి వద్ద రాజు-నిర్మల దంపతులు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోడ్డు పక్కనే ఫుట్పాత్పై జీవిస్తున్నారు. నెల రోజుల క్రితం వీరికి ఒక మగబిడ్డ జన్మించాడు. వీరి పరిస్థితులను గమనించిన ముగ్గురు మహిళలు బిడ్డను అమ్ముతావా అని రాజును ఆరా తీశారు.
మద్యం మత్తులో ఉన్న రాజు రూ.70వేలు తీసుకుని బిడ్డను వారికి అమ్మేశాడు. ఈ విషయం తెలియని నిర్మల బిడ్డ కోసం చుట్టుపక్కల అంతటా వెతికింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయగా ముగ్గురు మహిళలకు రాజే బిడ్డను విక్రయించినట్లు తేలింది. ఆ ముగ్గురిని ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన అఫ్రీన్,పర్వీన్,ఫర్హాన్ అనే మహిళలుగా గుర్తించారు. ఆ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు చంటిబిడ్డను ఎస్ఆర్ నగర్ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.
పేదరికం కారణంగా ఇలా కన్నబిడ్డలనే అమ్ముకుంటున్న దేశంలో చాలాచోట్ల బయటపడుతూనే ఉన్నాయి. గతేడాది మార్చిలోనూ హైదరాబాద్లోని జీడిమెట్లలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. నెలన్నర రోజుల చిన్నారిని కన్నతండ్రే రూ.22వేలకు విక్రయించాడు. పోలీసుల సహకారంతో ఆ చిన్నారి ఎట్టకేలకు తన తల్లి చెంతకు చేరింది.