IIT విద్యార్థులకు షాకింగ్ న్యూస్: ఇకపై ప్లేస్ మెంట్ కావాలంటే..?
దేశవ్యాప్తంగా ఉన్న 23 ప్రతిష్టాత్మక ఐఐటీల (IIT) విద్యార్థులకు ఆల్ ఐఐటీ ప్లేస్మెంట్ కమిటీ (AIPC) కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాంపస్ప్లేస్మెంట్లు, ఇంటర్న్షిప్ల కోసం సిద్ధం చేసే రెస్యూమెల్లో జేఈఈ (JEE) అడ్వాన్స్డ్ ర్యాంకులు, గేట్ (GATE) స్కోర్లు, పర్సంటైళ్లు వంటి ప్రవేశ పరీక్షల వివరాలను తొలగించాలని స్పష్టం చేసింది. ఈ విప్లవాత్మక నిర్ణయం ఇప్పుడు దేశీయ విద్యా, ఉద్యోగ రంగాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
రెజ్యూమ్ లో ర్యాంకులొద్దు
ఐఐటీల్లో ప్రవేశం సాధించడానికి విద్యార్థులు ఎంతో కష్టపడి సాధించిన ఈ ర్యాంకులను రెస్యూమ్ నుంచి పూర్తిగా తొలగించాలనే కొత్త నిబంధనను రాబోయే క్యాంపస్ రిక్రూట్మెంట్ల నుంచే వర్తింపజేయాలని ఏఐపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ మేరకు అన్ని విద్యాసంస్థల కెరీర్ డెవలప్మెంట్ సెంటర్లు విద్యార్థులకు అధికారిక మార్గదర్శకాలను పంపాయి. సెలక్షన్ ప్రక్రియలో వివక్షను నిరోధించి, అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

అసలు కారణాలు ఇవే
ఏఐపీసీ కన్వీనర్ జాన్ జోస్ తెలిపిన వివరాల ప్రకారం, విభిన్న వర్గాల అభ్యర్థులకు ప్లేస్మెంట్ల సమయంలో ఎలాంటి వివక్ష కలగకుండా చూసేందుకే ఈ చర్యలు తీసుకుంది. రిక్రూటర్లు అభ్యర్థుల జేఈఈ లేదా గేట్ ర్యాంకులను పరిశీలించి వారు ఏ కోటా కింద లేదా రిజర్వేషన్ విభాగంలో సీటు సాధించారో సులభంగా గుర్తిస్తున్నారనే ఆందోళన వ్యక్తమైంది. కేవలం ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా కాకుండా, విద్యార్థులు ఐఐటీలో చేరిన తర్వాత సాధించిన ప్రతిభ ఆధారంగానే వారిని మూల్యాంకనం చేయడం ఇక్కడ కీలకం.
కొత్త నిబంధనలివే
కొత్త నిబంధనల ప్రకారం, విద్యార్థులు తమ ఐఐటీ (IIT) చదువుల్లో సాధించిన సీపీఐ (CPI), సరికొత్త నైపుణ్యాలు, ప్రాజెక్టులు, ఇంటర్న్షిప్లు, పరిశోధనలను మాత్రమే తమ రెస్యూమెలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఒకవేళ రిక్రూటింగ్ కంపెనీలు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తే తప్ప ఈ ప్రవేశ పరీక్షల స్కోర్లను ముందస్తుగా వెల్లడించాల్సిన అవసరం లేదు. దీనివల్ల కొన్ని గంటల ప్రవేశ పరీక్ష మార్కులు కాకుండా, విద్యార్థి నిజమైన విద్యా ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందని కమిటీ ఆశిస్తోంది.

భిన్నాభిప్రాయాలు
అయితే, ఈ కీలక మార్పుపై ఇరువర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన జేఈఈ లాంటి కఠినమైన పరీక్షలలో రాత్రింబగళ్లు కష్టపడి సాధించిన మెరిట్ను రెస్యూమెల్లో దాచడం సరైన పద్ధతి కాదని కొందరు నిపుణులూ, పూర్వ విద్యార్థులూ వాదిస్తున్నారు. క్యాంపస్లో వివక్షకు తావులేని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని మరికొందరు సమర్థిస్తున్నారు. రిక్రూటర్లు ఈ మార్పుకు అనుగుణంగా అభ్యర్థుల ప్రతిభను ఏ విధంగా జడ్జ్ చేస్తారో రాబోయే ప్లేస్మెంట్స్ సీజన్ తేల్చనుంది.














Click it and Unblock the Notifications