ఎబోలాపై తప్పుడు వివరాలిస్తే క్రిమినల్ కేసులు పెడతాం: మంత్రి హెచ్చరిక!
ఆఫ్రికా దేశాలలో ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ విస్తృత నిఘా చర్యలు చేపట్టింది. ఈ విషయమై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎయిర్పోర్ట్లో పటిష్ట నిఘా - 21 రోజుల పర్యవేక్షణ
విమానాశ్రయాల్లో స్క్రీనింగ్, అత్యవసర స్పందన వ్యవస్థ, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం తదితర కీలక అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.ఎబోలా ప్రభావిత దేశాల నుండి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ ప్రక్రియను మరింత బలోపేతం చేశామని, అక్కడకు వచ్చే ప్రయాణికుల వివరాలను సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని 21రోజుల పాటు నిరంతరం ట్రాక్ చేస్తున్నామని తెలిపారు.

ఐసోలేషన్ లో ఇద్దరు అనుమానితులు.. వారి రిపోర్ట్ ఇలా
ఇప్పటివరకు ఇద్దరు అనుమానితులను గుర్తించి, వారిని గాంధీ ఆసుపత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు పేర్కొన్నారు. పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కి పంపిన వారి తొలి శాంపిల్స్ పరీక్షల్లో 'నెగిటివ్' వచ్చిందని, అయితే ఐసీఎంఆర్ సూచనల ప్రకారం రెండోసారి సేకరించిన శాంపిల్స్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. రెండోసారి కూడా నెగిటివ్ వస్తే వారిని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.
విదేశీ భాషా నిపుణులతో కలిసి స్క్రీనింగ్
విదేశీ ప్రయాణికులతో సంభాషించడం సులభతరం చేసేందుకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ సహాయం తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఎబోలా ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా మాట్లాడే ఫ్రెంచ్, అరబిక్, స్వాహిలి వంటి భాషల్లో నైపుణ్యం ఉన్న సిబ్బందిని ఎయిర్పోర్ట్లో మూడు షిఫ్టుల వారీగా, 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలని సూచించారు.
తప్పుడు వివరాలిస్తే క్రిమినల్ కేసులు
కొంతమంది ప్రయాణికులు విమానాశ్రయంలో తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇస్తున్నారనే విషయంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎబోలా బాధితులు, అనుమానితులు వాస్తవాలను దాచడం సమాజ ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై 'ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్' తో పాటు ఇతర కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని పోలీసు, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనల గురించి విమానాశ్రయంలోనే ప్రయాణికులకు స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు.
శాఖల మధ్య సమన్వయం - టెస్టింగ్ కిట్లు సిద్ధం
వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో కాంటాక్ట్ ట్రేసింగ్ అత్యంత కీలకమని, దీనికోసం ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, పోలీసు, ఎయిర్పోర్ట్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో సీసీఎంబీ సహకారాన్ని కోరగా.. ఐసీఎంఆర్ నుండి ప్రత్యేక ఎబోలా టెస్టింగ్ కిట్లు అందాయని, శాంపిల్స్ అందిన వెంటనే త్వరితగతిన పరీక్షలు పూర్తి చేసి నివేదికలు అందిస్తామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి స్పష్టం చేశారు.
సోషల్ మీడియా అపోహలను నమ్మకండి
రాష్ట్రంలో ఎబోలా నివారణకు ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధంగా ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని మంత్రి భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మరియు ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా యంత్రాంగం పనిచేస్తోందని, ప్రజలు సోషల్ మీడియా అపోహలను నమ్మకుండా కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరారు.













Click it and Unblock the Notifications