కేసీఆర్ సర్కారుకు బిగ్ రిలీఫ్: రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట లభించింది. రాష్ట్రంలో రైతుబంధు నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. పాత పథకమే కావడంతో రైతు బంధు సాయం పంపిణీ చేసేందుకు ఈసీ అనుమతిచ్చింది. నవంబర్ 28వ తేదీ లోపు మాత్రమే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేయాలని ఈసీ సూచించింది. దీంతో తెలంగాణలో రైతుబంధు పంపిణీకి అడ్డంకులు తొలగినట్లయింది.

ఈ నేపథ్యంలో నిధుల విడుదల ప్రారంభించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతుబంధు డబ్బులు విడుదల అవ్వడంతో తెలంగాణ రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్రంలో రైతు బంధు సాయం పంపిణీకి అనుమతివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.
ఈ క్రమంలోనే ఈసీ నుంచి అనుమతి లభించింది. కాగా, ఎన్నికల ముందు రైతుబంధు నిధులు రావడంతో.. ఈ అంశంపై అధికార బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
రైతుబంధు నిధులు విడుదల కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి లేఖలు రాశారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, తాము ఎలాంటి లేఖలు రాయలేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. పాత పథకమే కాబట్టి నిధులు విడుదల చేసేందుకు అనుమతివ్వాలంటూ బీఆర్ఎస్ సర్కారు ఎన్నికల సంఘానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా శుక్రవారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు నిధుల విడుదలకు అనుమతివ్వడం గమనార్హం.
రైతుబంధు నిధుల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతివ్వడం పట్ల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లింపులకు కూడా ఎన్నికల సంఘం అనుమతివ్వాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications