శాసనమండలిలో కవిత కన్నీరు! (వీడియో)
శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలి వేదికగా తన సొంత పార్టీపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ప్రసంగం మధ్యలో ఆమె ఎంతో భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకోవడం గమనార్హం.
పార్టీలో ప్రజాస్వామ్యం లేదు: కవిత ఆవేదన
శాసనమండలిలో మాట్లాడిన కవిత.. గత పదేళ్లుగా తాను పార్టీలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. "తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ గారల స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. కానీ రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజు నుంచే నాపై అనేక ఆంక్షలు మొదలయ్యాయి. పార్టీలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించినందుకు నాపై కక్ష కట్టారు. బిఆర్ఎస్ నుంచి నేను అనేక కట్టుబాట్లు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సొంత పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేనప్పుడు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడగలరు?" అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించాయి.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలకు బీఆర్ఎస్ పార్టీ తూట్లు పొడిచిందని కవిత మండిపడ్డారు. రైతుల ఆశలైన బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరవకపోవడం దారుణమన్నారు."బీఆర్ఎస్లో క్రమశిక్షణా కమిటీ అనేది ఒక పెద్ద జోక్. కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు" అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎనిమిదేళ్లుగా తాను ప్రజల కోసం చేస్తున్న ప్రయత్నాలను పార్టీ అడ్డుకుందని, తనకు అండగా నిలవాల్సిన పార్టీ పత్రికలు, ఛానెళ్లు కూడా మొహం చాటేశాయని వాపోయారు.
తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా కవిత ఒక భావోద్వేగపూరిత శపథం చేశారు."యాదగిరి లక్ష్మీనరసింహ స్వామిపై, నా ఇద్దరు కొడుకులపై ప్రమాణం చేసి చెబుతున్నాను.. ఇది ఆస్తుల పంచాయితీ కాదు, నా ఆత్మగౌరవ పంచాయితీ. నేను నిజం పక్షాన, నైతికత పక్షాన ఉన్నాను." అని కవిత పేర్కొన్నారు.
రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి
తాను ఎదుర్కొన్న వేధింపుల వల్లే గత ఏడాది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు కవిత వెల్లడించారు. "నన్ను కక్షగట్టి పార్టీ నుంచి బయటకు పంపారు. నేను ఇచ్చిన రాజీనామాను వెంటనే ఆమోదించాల్సిందిగా మండలి ఛైర్మన్ను కోరుతున్నాను" అని ఆమె విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అధిష్టానానికి, కవితకు మధ్య గత కొంతకాలంగా గ్యాప్ పెరిగిందనే వార్తలకు ఈ ప్రసంగం బలం చేకూర్చింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లిన సమయంలో పార్టీ నుంచి ఆశించిన మద్దతు లభించలేదనే అసంతృప్తి ఆమెలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు నేరుగా కేసీఆర్ నాయకత్వంపైనే ఆమె విమర్శలు గుప్పించడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications