తిరుమలలో కలకలం: మాజీ ఎమ్మెల్యే మిస్సింగ్!.. 24గం. గడిచినా..
మిస్సయిన తేదీ రాత్రి ఎంత వెతికినా ఆయన ఆచూకీ దొరకనట్లు తెలుస్తోంది. దీంతో కుంజా భిక్షం సతీమణి కుంజా వెంకట రమణ తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తిరుపతి/బూర్గంపహాడ్: తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం మిస్సింగ్ కలకలం రేపుతోంది. హుండీలో కానుకలు వేసే
సమయంలో తొక్కిసలాట జరగడం.. గత కొంతకాలంగా ఆయనకు మతిస్థిమితం లేకపోవడంతో కుటుంబ సభ్యుల నుంచి ఆయన తప్పిపోయారు.
కాగా, శుక్రవారం తన మనుమడి పుట్టు వెంట్రుకలను సమర్పించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల వెళ్లారు. శనివారం నాడు హుండీలో కానుకలు వేస్తున్న సమయంలో.. తొక్కిసలాట జరగడంతో ఆయన తప్పిపోయారు. కుంజా భిక్షం కుటుంబం వెంట ఆయన వియ్యంకుడు,ఖమ్మం జెడ్పీ మాజీ చైర్మన్ చందా లింగయ్య కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

మిస్సయిన తేదీ రాత్రి ఎంత వెతికినా ఆయన ఆచూకీ దొరకనట్లు తెలుస్తోంది. దీంతో కుంజా భిక్షం సతీమణి కుంజా వెంకట రమణ తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం భిక్షం కోసం పోలీసుల గాలింపు కొనసాగుతుండగా.. గత కొంతకాలంగా ఆయనకు మతిమరుపుతో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 24గం. గడిచినా భిక్షం ఆచూకీ దొరకకపోవడంతో.. ఆయన క్షేమంగా తిరిగిరావాలని కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే 1989-1994 కాలంలో కుంజా భిక్షం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన.. అక్కడినుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారు. 2004లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు.
సీసీటివి ఫుటేజీ పరిశీలన:
భిక్షం సతీమణి ఫిర్యాదుతో ఆయన కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. ఆలయ సీసీటివి ఫుటేజీని పరిశీలించారు. చివరిసారిగా హుండీ వద్దే ఆయన కనిపించినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఆయనతో పాటు అల్లుడు, కుమార్తె ఉన్నారు. ఆ తర్వాత మరెక్కడా ఆయన ఆచూకీ కనిపించలేదని తెలుస్తోంది.
ఆలయం బయటి కెమెరాల్లోను ఆయన కదలికలు ఎక్కడా రికార్డవలేదు. దీనిపై కుంజా భిక్షం కుమార్తె స్పందిస్తూ.. లోపల తాము హుండీ దగ్గర ఉన్న సమయంలో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకు వచ్చారని అన్నారు.ఆ సమయంలో రోప్ పార్టీ తమకు అడ్డురావడంతో.. తమ నుంచి తండ్రి భిక్షం వేరయ్యారని, ఆ తర్వాత కనిపించకుండా పోయారని వాపోయారు.












Click it and Unblock the Notifications