కమీషన్ పద్దతిలో రద్దుచేసిన నోట్ల మార్పిడి , నగల వ్యాపారి అరెస్టు
కమీషన్ పద్దతిలో 28 కోట్ల పాత నగదు నోట్లను మార్పిడి చేసినందుకు సికింద్రాబాద్ కుచెందిన బంగారు నగల వ్యాపారి నీల్ సుందర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ :పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత అక్రమార్కులు అనేక వక్రమార్గాల్లో డబ్బులను మార్పిడిచేసుకొన్నారు. నల్లధనాన్ని ఇతర మార్గాల ద్వారా మార్పిడి చేసుకొన్నారు. ఇదే తరహ ఘటనలు దేశ వ్యాప్తంగా ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. హైద్రాబాద్ లోని ఓ జ్యూయల్లర్ వ్యాపారి 30 శాతం కమీషన్ కు పాత నగదు నోట్లను మార్చుకొన్నట్టుగా అధికారులు గుర్తించారు.
పెద్ద నగదు నోట్ల రద్దుతో నోట్ల మార్పిడి కొసం అక్రమార్కులు అనేక మార్గాలను ఎంచుకొన్నారు. అయితే ఈ మార్గాల్లో ఎక్కువగా బంగారం కొనుగోళ్ళ కోసం వెచ్చించారు. బంగారం దుకాణాల యజమానులు కూడ అక్రమార్కులకే సహకరించారు.
పెద్ద నగదు నోట్ల రద్దు అయిన రోజున దేశ వ్యాప్తంగా అనేక బంగారం దుకాణాల్లో పెద్ద ఎత్తున విక్రయాలు చోటుచేసుకొన్నాయని ఆదాయపు పన్నుశాఖాధికారులు గుర్తించారు.
ఢిల్లీ, ముంబాయి, చెన్నై, హైద్రాబాద్ నగరాల్లో బంగారం వ్యాపారాలు జోరుగానే సాగినట్టు అధికారులు గుర్తించారు.హైద్రాబాద్ కు చెందిన ఓ నగల వ్యాపారి పెద్ద నగదు నోట్లు రద్దుచేసిన రాత్రే సుమారు వంద కోట్ల రూపాయాల వ్యాపారం చేశాడని చెబుతున్నారు.
కమీషన్ పద్దతిలో పాత నగదు మార్పిడి
పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన రోజున హైద్రాబాద్ కు చెందిన ముసద్దీలాల్ జ్యుయల్లర్స్ కేసు దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. సిసిఎస్ పోలీసులు జరిపిన దర్యాప్తులో అనేక అంశాలు వెలుగుచూశాయని పోలీసులు చెబుతున్నారు.కమీసన్ పద్దతిలో పాత నగదు నోట్లను బడా వ్యాపారులు మార్పిడి చేసుకొన్నారని అధికారులు గుర్తించారు. 30 శాతం కమీషన్ పద్దతిలో పాత నగదు మార్పిడి చేసుకొన్నారని గుర్తించారు.
ముసద్దీలాల్ కేసులో అష్టలక్ష్మి గోల్డ్ వ్యాపారి
ముసద్దీలాల్ జ్యుయల్లర్స్ వ్యాపారి కేసులో లోతుగా పరిశీలించిన పోలీసులకు అనేక కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ముసద్దీలాల్ కు చెందిన బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఎక్కడి నుండి ఎక్కడికి ఈ ఖాతాల ద్వారా డబ్బులు మళ్ళాయనే విసయాన్ని గుర్తించారు పోలీసులు. సికింద్రాబాద్ కుచెందిన అష్టలక్ష్మి గోల్డ్ బులియన్ నిర్వాహకుడు నీల్ సుందర్ దందా వెలుగు చూసింది.నీల్ సుందర్ ముసద్దీలాల్ తో కలిసి 30 శాతం కమీషన్ కు రూ.28 కోట్ల పెద్ద నోట్లు మార్పిడి చేసుకొన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు గురువారం నాడు నీల్ సుందర్ ను పోలీసులు అరెస్టు చేశారు.ఈ మేరకు డిసిపి అవినాష్ మహంతి ప్రకటించారు.
నోట్లు ఎలా మార్చారంటే ?
పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత నల్ల ధనం మార్పిడి చేసుకొనేందుకు బంగారం కొనుగోలులో పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ప్రయత్నాలను ప్రారంభించారు.ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొనేందుకు నీల్ సుందర్ ప్రయత్నాలు ప్రారంభించాడు.30 శాతం కమీషన్ ను తీసుకొని డబ్బులు మార్చేందుకు ఆయన అంగీకరించాడు. తన దందాకు సహకరిస్తే పది శాతం కమీషన్ ను ముసద్దీలాల్ కు చెల్లించేలా ఒప్పందం చేసుకొన్నాడు. నవంబర్ 8వ, తేది రాత్రి పూటే మూడు గంటల్లో వేల వంది కస్టమర్లకు బంగారం విక్రయించే ప్రణాళికను సిద్దం చేసుకొన్న ముసద్దీలాల్ యాజమాన్యం నీల్ సుందర్ ప్రతిపాదనలకు అంగీకరించింది.
బ్యాంకు ఖాతాలతో కమీషన్ వ్యవహరం బట్టబయలు
పెద్ద నగదు నోట్లు రద్దు చేసిన మరుసటిరోజే ముసద్దీలాల్ కు అనుబంధంగా ఉన్న సంస్థ వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లోకి 28 కోట్లను నీల్ సుందర్ జమ చేశాడు. ఆ మేరకు బంగారాన్ని ఖరీదు చేసినట్టు రికార్డులు రూపొందించాడు. స్వల్ప వ్యవధిలోనే ఆ మొత్తాన్ని నీల్ సుందర్ సంస్థకు చెందిన రెండు ఖాతాల్లోకి ముసద్దీలాల్ యాజమాన్యం తరలించింది.అయితే బంగారం విక్రయాలకు సంబందించిన రసీదులు, డెలివరి రికార్డుల కోసం ఆరా తీస్తే అవి అలాంటివి లేవని తేలింది.ఈ వ్యవహరం సైతం మార్పిడికి సంబందించి నీల్ సుందర్ ను పోలీసులు అరెస్టు చేశారు.