సీఎం పీఎ అసిస్టెంట్ అంటూ రూ.70లక్షల వసూళ్లు: మోసం మామూలుగా లేదు!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారుడికి అసిస్టెంట్ పీఏనంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఇద్దరిని రాచకొండ ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరు 20 మంది అమాయకుల నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేసినట్టు విచారణలో తేలింది.
నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ప్రధాన నిందితుడు ఏకంగా ఎర్రబుగ్గను కారుకు పెట్టుకొని తిరిగుతూ హైదరాబాద్ తోపాటు గ్రామీణ ప్రాంతాల్లో హల్ చేసినట్టు తెలిసింది. కారు నంబర్ ప్లేటుకు సైతం పీఏ టు గవర్నమెంట్ పేషీ అని రాసుకొని చలామణి అవుతూ నిరుద్యోగులను ముంచేశాడు. రాచకొండ పరిధిలో నమోదైన ఓ కేసును దర్యాప్తు చేసిన ఎస్వోటీ పోలీసులు చివరకు ఈ మోసగాడి ఆటను కట్టించారు.
ఇంటి ముందు బోర్డు, బుగ్గ కారు
రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్ బుధవారం మీడియా సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. వరంగల్ మండీబజార్కు చెందిన మహ్మద్ ఖిఫాయత్ అలీ(29) ప్రైవేటు ఉద్యోగి. తెలంగాణ సీఎం సలహాదారుకు వ్యక్తిగత సహాయకుడినంటూ తన ఇంటి ముందు బోర్డు తగిలించుకున్నాడు. తన కారుకు ఎర్రబుగ్గ తగిలించుకొని స్థానికంగా హడావుడి చేసేవాడు.
రూ.70లక్షల వసూలు
అంతేగాక, ఇఫ్తార్ విందుల పేరిట ప్రముఖుల్ని పిలిచి హంగామా చేసేవాడు మహ్మద్ ఖిఫాయత్ అలీ. తన అనుచరుడు మొయినుద్దీన్(34)కు నెలవారీ వేతనం ఇస్తూ గన్మెన్ వేషం కట్టించాడు. ఖిఫాయత్ అలీ హడావుడి చూసి అతడు నిజంగానే సచివాలయ ఉద్యోగి అని స్థానికులు నమ్మారు. ఈ క్రమంలో గత మూడేళ్లుగా ఉద్యోగాలిప్పిస్తానంటూ వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్, నంద్యాలకు చెందిన ఇరవై మంది నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేసి కార్లు కొనుగోలు చేశాడు.
సచివాలయం రప్పించి..
ఒక్కొక్కరు రూ.50 వేల నుంచి రూ.9 లక్షల వరకు అలీ చేతిలో పోశారు. ఉప తహశీల్దార్ ఉద్యోగం కోసం రూ.15 లక్షలు అవుతాయని.. తొలుత పొరుగు సేవల కింద ఉద్యోగమిప్పించి తర్వాత పర్మినెంట్ చేయిస్తానని ఖిఫాయత్ అలీ పలువురిని నమ్మించాడు. అలా రోజులు గడుస్తున్న క్రమంలో బాధితులెవరైనా గట్టిగా అడిగితే వారిని సచివాలయం వద్దకు రప్పించేవాడు. సచివాలయ ప్రవేశద్వారం వద్ద వారిని ఉంచి లోనికి వెళ్లి వచ్చేవాడు. త్వరలోనే నియామక ఉత్తర్వులు ఇస్తారంటూ నమ్మించి పంపించేవాడు.
మోసగాడే కాదు, హంతకుడు కూడా..
చివరకు బాధితుల ఒత్తిడి తీవ్రం కావడంతో ఖిఫాయత్ అలీ తన మకాంను మట్టెవాడ నుంచి హైదరాబాద్కు మార్చాడు. ఓ బాధితుడి ఫిర్యా మేరకు ఎస్వోటీ పోలీసుల దర్యాప్తుతో అతడి బండారం బయటపడింది. కాగా, గతంలో వరంగల్ మండీబజార్కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి హత్యకేసులో ఖిఫాయత్ అలీ నిందితుడిగా తేలింది. అలాగే ఉత్తరప్రదేశ్ ఝాన్సీకి చెందిన అతడి మొదటి భార్య ఫిర్యాదుపై అక్కడ ఖిఫాయత్పై క్రిమినల్ కేసు నమోదైనట్లు వెల్లడైంది. ఖిఫాయత్ అలీ బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలని కమిషనర్ సూచించారు. ఖిఫాయత్, మొయినుద్దీన్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.లక్ష నగదు, మూడు కార్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగం బ్యాక్ డోర్లో రాదని, మోసగాళ్ల మాటలు నమ్మి బాధితులుగా మారవద్దని సీపీ మహేశ్ భగవత్ సూచించారు.