అద్భుతం చేశారు: సీఎం కేసీఆర్పై విజయేంద్ర ప్రసాద్ ప్రశంసల వర్షం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR)పై ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొత్త సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలో ఇంత గొప్ప సచివాలయాన్ని నిర్మించడం అద్భుతమని విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు.
వారసత్వం, సాంస్కృతిక వైభవం, ఆధునికతల కలబోతకు నిలువెత్తు నిదర్శనంగా సచివాలయం ఉందని విజయేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. కేసీఆర్ పట్టుదల, అకుంఠిత దీక్షతో అద్భుతమైన దేవాలయాలను, ప్రజా నిర్మాణాలను కేసీఆర్ చేస్తున్నారని కొనియాడారు. మనుషులు రుషులవుతారనే నానుడిని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారని విజయేంద్ర ప్రసాద్ ప్రశంసించారు.

పది నెలల సమయంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, అంతకు మించిన ప్రజా సచివాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విషయమన్నారు విజయేంద్ర ప్రసాద్. అసాధ్యాలను సుసాధ్యం చేయడం సీఎం కేసీఆర్కే సాధ్యమని కొనియాడారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో జెట్ స్పీడ్తో పరుగులు పెడుతుందన్నారు. ఈ అభివృద్ధి పట్ల తెలంగాణ బిడ్డగా చాలా సంతోషంగా ఉందని విజయేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్ వెంట గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ, సినీ ప్రొడ్యూసర్ కొణతం లక్ష్మణ్, డైరెక్టర్ మహదేవ్ తదితరులు ఉన్నారు. కాగా, ప్రపంచం దృష్టించిన ఆకర్షించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి పాన్ వరల్డ్ సినిమాలను విజయేంద్ర ప్రసాద్ అందించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ను కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.












Click it and Unblock the Notifications