హైదరాబాద్లో విషాదం : కరోనా భయంతో.. బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య..
హైదరాబాద్లోని రామంతాపూర్లో దారుణం చోటు చేసుకుంది. కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఓ వృద్దుడు అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కొంతకాలంగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకెళ్లగా.. కరోనా నెగటివ్గా తేలిందన్నారు. అయినప్పటికీ అనుమానంతో ఆందోళన చెందేవాడని తెలిపారు. గ్యాస్ట్రిక్ కారణంగా ఆయాసం వస్తుండటంతో.. కరోనానే కారణమని అపోహ చెందాడని అన్నారు.
కుటుంబ సభ్యులు ఏమంటున్నారు...
కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రామాంతపూర్ వీఎస్ అపార్టుమెంటులోని ప్లాట్ నెంబర్ 303లో నివసించే వాసిరాజు కృష్ణ మూర్తి (60 ) కొంతకాలంగా గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నాడు. తరుచూ ఆయాసం వస్తుండటంతో కరోనా సోకిందేమోనని కృష్ణమూర్తి ఆందోళన చెందాడు. ఈ నేపథ్యంలో కింగ్ కోఠి అసుపత్రికి తీసుకెళ్లగా కరోనా వైద్య పరీక్షలు చేయగా నెగటివ్గా తేలింది. అయినప్పటికీ కృష్ణమూర్తి మనసు కుదుటపడలేదు. మనసులో ఎక్కడో ఏదో అనుమానం,అపోహ అతన్ని వెంటాడింది.
గాంధీకి వెళ్దామనుకుంటున్న తరుణంలోనే..
కృష్ణమూర్తి ఆందోళన చూడలేక.. కుటుంబ సభ్యులు మరోసారి ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకున్నారు. శనివారం(మే 2) ఉదయం గాంధీ ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్దమవుతున్న తరుణంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాల్కనీ గోడపై నుంచి కిందకు దూకడంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. దీంతో అక్కడికక్కడే అతను మృతి చెందాడు. ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించడంతో అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ అసుపత్రి మార్చురీకి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కరోనా భయంతో ఆత్మహత్యలు
మార్చి నెలలో సూర్యాపేట జిల్లాలోనూ శ్రీనివాసరావు అనే ఓ రేషన్ డీలర్ కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో అక్కల వెంకటయ్య(55) అనే వ్యక్తి కూడా మార్చిలో కరోనా భయంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దేశవ్యాప్తంగానూ పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.సాధారణ జలుబు,దగ్గు,ఆయాసం వంటి లక్షణాలకు కరోనా సోకిందేమోనన్న అపోహలు వద్దని వైద్యులు సూచిస్తున్నారు. అనవసరంగా ఆందోళన చెంది ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెబుతున్నారు. అయినప్పటికీ కొంతమంది విపరీతంగా ఆందోళన చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సమయంలో మనోధైర్యం అవసరమని.. కుటుంబ సభ్యులు వారి ఆందోళనను తొలగించే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని చెబుతున్నారు.