తెలంగాణ పల్లె పోరు.. మొదలైన తొలి విడత పంచాయతీ ఎన్నికలు !!
తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 189 మండలాల్లో 4,236 సర్పంచ్, 37,440 వార్డులకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవ్వగా.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. కాగా పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు భేటీ అయ్యి ఉపసర్పంచ్ని ఎన్నుకుంటారు.
అయితే చలి తీవ్రత కారణంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్ల రాక ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. పోలింగ్ కోసం మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 93,905 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈరోజు ( డిసెంబర్ 11, 2025 ) జరుగుతున్న ఎన్నికల్లో 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు... 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ చేస్తున్నారు. అయితే తొలి దశలో 4,236 గ్రామపంచాయతీ సర్పంచి పదవులకు.. 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో ఐదు సర్పంచి పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదని అధికారులు వెల్లడించారు. 396 సర్పంచి పదవులు... 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామపంచాయతీ సర్పంచి, 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే విధించాయి.
అంతే కాకుండా ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,461 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 50 వేల మంది సివిల్ పోలీసులు, 60 ప్రత్యేక పోలీసు ప్లటూన్లు, రెండు వేల మంది అగ్నిమాపక, అటవీ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారన్నారు.












Click it and Unblock the Notifications