ఆసక్తికరం: తెలంగాణ తెలుగుదేశం పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్: మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య టీడీపీలో చేరనున్నారు. ఈ నెల 7న హైదరాబాద్కు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన చేరుతారని వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మధ్యాహ్నం బండి పుల్లయ్యతో పాటు ఆయన అనుచరులు చంద్రబాబును కలిసేందుకు అపాయింటుమెంట్ లభించిందని చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండకు చెందిన ఆయన విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలంతో పనిచేస్తూ కమ్యూనిస్టు పార్టీ ముఖ్య నాయకుడిగా ఎదిగారు.
మహబూబాబాద్ నియోజకవర్గంలో 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మిత్ర పక్షాల సీపీఐ అభ్యర్థిగా తొలిసారి కాంగ్రెస్ కంచుకోటలో ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో 2001లో టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో సభ్యుడిగా పని చేశారు.
తర్వాత క్రమంలో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ నెలకొల్పిన నవ తెలంగాణ పార్టీ లో చేరారు. నవ తెలంగాణ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశాక స్తబ్దుగా ఉన్నారు. గత కొద్ది కాలంగా క్రియాశీలక రాజకీయాల్లో పని చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.