గద్దర్ కూతురు గుమ్మడి వెన్నెలకు రేవంత్ సర్కారు కీలక పదవి
ప్రజా యుద్ధనౌక గద్దర్ కూతురు గుమ్మడి వెన్నెలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా వెన్నెలను నియమించింది. ఈ మేరకు యువజన పురోగతి, సంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన ఆట పాటలతో ఉగ్రతలూగించిన బహుజన యుద్ధ నౌక్ గద్దర్ ఫ్యామిలీని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెలకు కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.

కాంగ్రెస్ అభ్యర్థిగా కంటోన్మెంట్ నుంచి బరిలోకి దిగిన వెన్నెల.. బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే, ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. కాగా, బీజేపీ నుంచి వచ్చిన గణేష్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో ఆయన పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, వెన్నెలకు రాష్ట్ర సాంస్కృతిక ఛైర్ పర్సన్గా అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.
కాగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ సేవలను గుర్తిస్తూ రేవంత్ సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి సంవత్సరం సినిమాలకు అందించే అత్యుత్తమ పురస్కారమైన నంది అవార్డును.. గద్దర్ పురస్కారంగా పేరు మార్చి గౌరవించింది. హైదరాబాద్ లోని తెల్లాపూర్ పరిధిలో గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆయనపై అభిమానాన్ని చాటుకుంది.












Click it and Unblock the Notifications