పాన్ షాపులో గంజాయి అమ్మకాలు.. అధికారులే విస్తుపోయారు!
మీటా పాన్, సాదా పాన్, జర్దా పాన్.. ఇలా నోరు తీపి చేసుకునేందుకు లేదా అలవాటుగా పాన్ వేసుకునేందుకు షాపుల ముందు జనం క్యూ కట్టడం సాధారణం. మరికొందరు గుట్కాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల కోసం వెళ్తుంటారు. కానీ, ఆ పాన్ షాపులో మాత్రం సీన్ రివర్స్! పాన్ల చాటున విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు సాగిస్తున్న వ్యవహారం వెలుగుచూసింది. మాదాపూర్ ప్రాంతంలోని ఓ పాన్ షాపుపై దాడులు నిర్వహించిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్ (STF) బృందం, అక్కడ జరుగుతున్న దందాను చూసి విస్తుపోయింది.

చందానాయక్ నగర్ - మాదాపూర్ రోడ్డులోని 'సోహెల్ పాన్ షాప్'లో నిబంధనలకు విరుద్ధంగా గంజాయి అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం ఎక్సైజ్ శాఖకు అందింది. దీంతో ఎస్టీఎఫ్ డీ-టీం సీఐ నాగరాజు తన సిబ్బందితో కలిసి సదరు పాన్ షాపుపై ఆకస్మికంగా మెరుపు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా షాపులో విక్రయానికి సిద్ధంగా ఉంచిన 500 గ్రాముల గంజాయి ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్యాకెట్లను తన పాన్ షాపుకు వచ్చే యువకులు, కస్టమర్లకు రూ. 500ల చొప్పున విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు సీఐ నాగరాజు వెల్లడించారు.
మాదాపూర్ చందానాయక్ నగర్లోని 'సోహల్ పాన్ షాప్'పై ఎస్టీఎఫ్ దాడి చేసి 500 గ్రాముల గంజాయిని సీజ్ చేసింది. లాభాల కోసం గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్న యజమాని మాలిక్ అస్లామ్ను సీఐ నాగరాజు బృందం అరెస్ట్ చేసింది#PanShop #Telangana #ViralWatch #OITelugu pic.twitter.com/uduH45yOdd
— oneindiatelugu (@oneindiatelugu) July 23, 2026
నిందితుడి అరెస్ట్.. మాదాపూర్ స్టేషన్కు అప్పగింత
పాన్ షాపు ముసుగులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న షాపు యజమాని 'మాలిక్ అస్లామ్ తాంబోలీ'ని ఎస్టీఎఫ్ పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న గంజాయిని మాదాపూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అక్రమ దందాలు, మాదకద్రవ్యాల విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications