రెండు రోజులు బాలికపై ఆరుగురు రేప్ చేసి రోడ్డుపై పడేశారు
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలికను ఆరుగురు యువకులు రెండు రోజులపాటు అతి దారుణంగా అత్యాచారం చేశారు. జిల్లాలోని కొణిజర్లలో ఆదివారం ఈ దారుణం వెలుగు చూసింది.
ఆరుగురు స్నేహితులు రెండు రోజుల క్రితం ఓ బాలికను అపహరించి ఓ ఇంట్లో నిర్భందించారు. ఈ రెండురోజులూ ఆ బాలికపై ఆరుగురూ అతి దారుణంగా అత్యాచారం చేసినట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రులు కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి - గిరిజన మైనర్ బాలికను బలవంతంగా తమ వాహనంలో ఎక్కించి రెండు రోజులు నిర్బంధించి లైంగికదాడికి పాల్పడ్డారు. రెండు రోజులు ఆ బాలికను శారీరకంగా చిత్రహింసలు పెట్టారు. ఒకరి వెంట మరొకరు రెండు రోజుల పాటు ఆ బాలికను చిత్రహింసలకు గురిచేశారు.
రెండు రోజుల పాటు స్కార్పియో వాహనంలో తిప్పుతూ గ్రామీణ ప్రాంతాలలోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఆ మృగాళ్లు బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.అనంతరం ఆ బాలికను నడిరోడ్డుపై వదిళివెళ్లారు. చివరకు ఆ బాలిక కోసం ఆమె తల్లి దేవులాడుతూ కొణిజర్ల చేరుకోవడంతో ఆ కామాంధుల ఆకృత్యాలు బహిర్గతమయ్యాయి.
ఖమ్మంలోని ఇందిరానగర్కు చెందిన ఓ గిరిజన మైనర్ బాలికను శుక్రవారం సాయంత్రం టేకులపల్లి వద్ద ముగ్గురు కామాంధులు బలవంతంగా స్కార్పియో వాహనంలో ఎక్కించుకుని తనికెళ్ల పరిసర ప్రాంతాలకు తీసుకువచ్చి నిర్జీవ ప్రదేశంలో ఆ ముగ్గురు లైంగికదాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగక శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు స్కార్పియో వాహనాన్ని తిప్పుతూ పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున బాలికను కొణిజర్ల సెంటర్లో వదిలి వెళ్లారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఆరుగురిని కొణిజర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను తీసుకెళ్లిన స్కార్పియో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది.