ఇదో మిలీనియం జోక్, ఎన్ని చిక్కులంటే?: కేంద్ర ప్రకటనపై ఏపీ కూడా అంటూ హరీశ్ ఫైర్
మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కేంద్రం మిర్చి మద్దతు ధర విషయంలో బుధవారం విడుదల చేసిన ప్రకటనతో తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం
హైదరాబాద్: మిర్చి రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కేంద్రం మిర్చి మద్దతు ధర విషయంలో బుధవారం విడుదల చేసిన ప్రకటనతో తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం లేదని అన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసిందన్నారు.
కేంద్రం మిర్చి మద్దతు ధరను రూ.5వేలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటనలో స్పష్టత లేదని అన్నారు. రాష్ట్రంలో 7లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉంటే.. కేంద్రం మాత్రం 33వేల కోట్ల మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పిందని అన్నారు. ఇలా అయితే, మిగితా రైతుల పరిస్థితి ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు.
కేంద్రం శఠగోపం పెడుతోందంటూ ఎద్దేవా చేశారు. స్థానిక బీజేపీ నేతలేమో రూ. 10వేలు మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్ చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రూ.5వేలే ప్రకటించిందని అన్నారు. తమ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి లేఖ రాశారని, తాను కూడా మద్దతు ధర కోసం మార్చి 30వ తేదీన కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. మద్దతు ధర రూ.7వేలు ప్రకటించాలని కోరినట్లు తెలిపారు.
అయితే, కేంద్రం మాత్రం నెల రోజుల తర్వాత స్పందించిందని హరీశ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనాలి, నష్టం భరించాలని అంటున్నారని చెప్పారు. రూ. 10 నుంచి 20కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపేసుకోవాలని చూస్తోందన్నారు. అందుకే కేంద్రం ప్రకటన ఓ మిలీనియం జోక్ అన్నానని హరీశ్ చెప్పారు. కేంద్రం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని అన్నారు.
దేశాన్ని 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్, పదేళ్లు పాలించిన ఎన్డీఏ ప్రభుత్వాలు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనలేకపోయాయని మండిపడ్డారు. ఇప్పుడు రైతుల దుస్థితికి ఎవరు కారణమని ప్రశ్నించారు. గతంలో కూడా మద్దతు ధర లేక తెలంగాణ రైతులు ఆందోళనలు చేశారని, అప్పుడు ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు.
కేంద్రం ప్రకటనలో బెస్ట్ క్వాలిటీ మిర్చీనే రూ. 5వేలకు కొనమంటున్నారని, ఇప్పటికే నాణ్యమైన మిర్చికి రూ.5500ల ధర ఉందని.. ఇలా చూస్తే రూ. 500ల తక్కువకే కొనాలా? అని ప్రశ్నించారు. రైతుల వద్ద ఉన్న మొత్తం క్వాంటిటీని, రూ. 7వేల మద్దతు ధరతో కొనుగోలు చేయాలని తాము కేంద్రాన్ని కోరుతున్నామని హరీశ్ రావు తెలిపారు. ఏమైనా నష్టం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా భరిస్తుందని అన్నారు.
మద్దతు ధర లేకపోవడం ఎవరి బాధ్యత అని ప్రశ్నించారు హరీశ్ రావు. కోల్డ్ స్టోరేజీల కోసం కేంద్రమంత్రులను కలిశానని.. రెండుళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అనుమతులు రాలేదని అన్నారు. సమస్యను అర్థం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. శాశ్వత పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు.
వచ్చే ఏడాది నుంచి సీఎం కేసీఆర్ రైతులకు రూ. 4వేలు ఇస్తామని చెప్పారని, రూ. 500కోట్ల మార్కెట్ ఇంటర్ వెన్షన్ పంటన నిధిని ఏర్పాటు చేసినట్లు హరీశ్ రావు తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వం రైతుల కోసం చేయనంత మేలును తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతు సంక్షేమం కోసమే తాము పనిచేస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి ఈరోజు కేంద్రానికి లేఖ రాస్తున్నామని తెలిపారు. కేంద్రం పూర్తి స్పష్టతతో, ఉదారంగా రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 50శాతం నిధులను ముందే విడుదల చేయాలని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం క్వాంటిటీని కొనుగోలు చేయాలని కోరనున్నట్లు తెలిపారు.