హైడ్రా కూల్చివేతల వెనుక ఇదీ లక్ష్యం..!!
తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా ఇప్పుడు సంచలనంగా మారింది. హీరో నాగార్జున కన్వెన్షన్ కూల్చివేతతో రాజకీయంగా చర్చ మొదలైంది. హైడ్రా తదుపరి టార్గెట్ పైన పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. ఆక్రమణలను వదిలేది లేదని సీఎం రేవంత్...హైడ్రా స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నేతల నిర్మాణాల పైన ఫిర్యాదులు రావటంతో హైడ్రా చర్యలకు సిద్దమైంది. ఇదే సమయంలో హైడ్రా కూల్చివేతల వెనుక రాజకీయం పై హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు.
హైడ్రామా నడుస్తోంది
హైడ్రా పేరుతో తెలంగాణలో హైడ్రామా నడుస్తోందని మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. రాష్ట్రంలో పాలనను పక్కదారి పట్టించే పాలన నడుస్తోందని ఆరోపణలు చేశారు. విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిని సీఎం రేవంత్రెడ్డి టార్గెట్ చేశారని ఆరోపించారు. ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని రేవంత్ చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

వారే కూల్చేస్తారు
రాజేశ్వర్ రెడ్డి కాలేజీల్లో అక్రమ నిర్మాణాలు ఉంటే చెప్పండి.. ఆయనే కూల్చేస్తారని హరీష్ సవాల్ విసిరారు. పార్టీ మారటం లేదని పల్లాను రాజకీయంగా ఎదుర్కోలేక టార్గెట్ చేశారని మండిపడ్డారు. పల్లా కాలేజీలు ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లో లేదని నీటి పారుదల, రెవెన్యూ శాఖ రిపోర్ట్ ఇచ్చిందని గుర్తుచేశారు. అన్ని అనుమతులు ఉన్నా సీఎం రేవంత్ కావాలనే ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము హైడ్రాకు వ్యతిరేకం కాదని హరీష్రావు తెలిపారు. అక్రమ నిర్మాణాలను తాము ప్రోత్సహించమని స్పష్టం చేశారు.
రాజకీయ కక్షతో
రాజకీయ కక్షలు విద్యాసంస్థలు, ఆస్పత్రులపై చూపొద్దని హితవు పలికారు. తమ పార్టీ నేతలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డివి తప్ప రాష్ట్రంలో అన్ని ఇంజినీరింగ్, మెడిసిన్ కాలేజీల సీట్లు పెంచారని తెలిపారు. తెలంగాణలో డెంగ్యూ జ్వరాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టడం లేదని విమర్శలు చేశారు. కౌన్సిల్ చైర్మన్కు చికెన్ గున్యా వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ, అన్నదాతలపై రేవంత్ రెడ్డిది డబుల్ స్టాండ్ వైఖరని ఆరోపించారు.












Click it and Unblock the Notifications