అలాంటి రేవంత్ నీతులు చెబుతున్నారు: హరీశ్ రావు, పీఎస్ నుంచి విడుదల
'ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా?' అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
మార్పు తెస్తానంటున్న రేవంత్ రెడ్డి.. నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు ఏమీ లేదని విమర్శించారు హరీశ్ రావు. ఏ నిరుద్యోగ యువతకు మాటిచ్చారో.. అశోక్నగర్లో అదే నిరుద్యోగుల వీపులు కమిలిపోయేలా కొట్టారని మండిపడ్డారు. అర్ధరాత్రి గిరిజనులపై దాడి చేసి జైల్లో నిర్బంధించారని ధ్వజమెత్తారు.

రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ హయాంలోని ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. పోలీసులతో రాజ్యమేలే ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదన్నారు. ఇందిరమ్మ లాంటివాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించిన దేశం మనదని అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే గొంతునొక్కాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
పోలీస్ స్టేషషన్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయాయని.. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో కాకుండా గాంధీభవన్లో తయారవుతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. అంతేగాక, ఏ సెక్షన్లు పెట్టాలి.. ఎవరిని అరెస్ట్ చేయాలో గాంధీభవన్ నుంచి ఆదేశాలిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని.. పోలీసులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేయాలని హరీశ్ రావు హితవు పలికారు.
రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనిచేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడేది మీరేనంటూ పోలీసులను హరీశ్ రావు హెచ్చరించారు. ప్రతిపక్షంపై సీఎం రేవంత్ పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణలో ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన సాగుతోందన్నారు. రేవంత్ పాలనలో ప్రజలకు ఎలాంటి మంచి జరగలేదన్నారు. కాంగ్రెస్ ఏడో గ్యారంటీగా రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని హరీశ్ రావు విమర్శించారు.
పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుకు నిరసనగా వెళ్లిన హరీశ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు, ఎక్స్ వేదికగానూ రేవంత్ సర్కారుపై హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ''ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా?' ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు. ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారన్నారు.
Live: Former Minister and MLA Sri @BRSHarish addressing the media at gachibowli police station. https://t.co/ylUI3lC59e
— Office of Harish Rao (@HarishRaoOffice) December 5, 2024
'ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, నా పై, బిఆర్ఎస్ నాయకులపై దుర్మార్గంగా ప్రవర్తించారు. అక్రమ అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కి తరలిస్తున్నారు.
అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు. తెలంగాణ సమాజమే నీకు బుద్ధి చెబుతుంది.
ప్రజలు ఎన్నుకున్న తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని, ఏడాది కాకుండానే డబ్బు సంచులతో కూల్చే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి... నేడు ప్రతిపక్ష నాయకులు ఎలా ఉండాలో నీతులు చెబుతున్నడు. దెయ్యాలు వేదాలు వల్లించడం కంటే దారుణమిది. ఊసరవెల్లి కూడా రేవంతును చూసి సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటది' అంటూ హరీశ్ ఎద్దేవా చేశారు.
అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మరియు బీఆర్ఎస్ నాయకులను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు వెళ్లి, సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ @RaoKavitha pic.twitter.com/Ah0eceTqKI
— Deepak Mukhra K (@GadgeDeepak9) December 5, 2024
మరోవైపు, అంతకుముందు హరీశ్ రావును అరెస్ట్ చేశారనే విషయం తెలియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ శ్రేణులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హరీశ్ రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్టేషన్లోనే కవిత నిరసన చేపట్టారు. కాగా, గురువారం రాత్రి హరీశ్ రావును పోలీసులు విడుదల చేశారు.












Click it and Unblock the Notifications