కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం: డైరెక్టర్ సహా ఆరుగురు మృతి, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
సంగారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగాయి. రియాక్టర్ పేలడంతో అక్కడే పనిచేస్తున్న పలువురు కార్మికులు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ డైరెక్టర్ రవితో పాటు ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో తమను కాపాడాలంటూ కార్మికులు ఆర్తనాదాలు చేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

రియాక్టర్ పేలుడు ధాటికి మూడు భవనాలు కూలిపోయాయి. దీంతో భవనాల కింద ఎవరైనా చిక్కుకున్నారా? అనేదానిపై సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 50 మంది కార్మికులు ఉన్నట్లు తెలిసింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
భారీ అగ్ని ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఎస్బీ పరిశ్రమ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సహాయక చర్యలపై సమీక్షించిన సీఎం.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పేలుడు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని ప్రభుత్వానికి ఆదేశించారు.
ఘటనా స్థలికి మంత్రి దామోదర
పరిశ్రమ వద్ద జరిగిన పేలుడు ఘటనను రాష్ట్ర వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలించారు. అనంతరం సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ ఆసుపత్రుకు వెళ్లి చికిత్సపొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. మరోవైపు, సంగారెడ్డి పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఆ పార్టీ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.












Click it and Unblock the Notifications