హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
హైదరాబాద్: నగర ప్రజలకు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. శుక్రవారం రాత్రి నుంచి మెట్రో సర్వీసులు అదనపు గంటల్లో పనిచేయనున్నాయి. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా, ఇక నుంచి రాత్రి 11.45 గంటలకు టెర్మినల్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉండనుంది.
అదేవిధంగా ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

పొడిగించిన మెట్రో వేళలు నేటి రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులకు రద్దీ నుంచి కొంత ఉపశమనం లభించనుంది. ఆలస్యంగా వెళ్లే ప్రయాణికులకు కూడా సౌకర్యవంతంగా ఈ వేళలు ఉండనున్నాయి.
ప్రయాణికుల రవాణాలో రికార్డు
దేశంలో మూడవ పొడవైన కార్యాచరణ మెట్రో నెట్వర్క్గా పేరుపొందిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులను చేరవేయడంలో మరో మైలు రాయికి చేరింది. మెట్రో రైలు ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు ఆరున్నరేళ్లలో 50 కోట్ల మంది ప్రయాణించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంతో పాటు ప్రతి రోజు సగటున 5 లక్షల మంది మెట్రోలో గమ్యస్థానానికి చేరుకుంటున్నారని తెలిపింది.
హైదరాబాద్లో మెట్రో రైలును 2017 నవంబరు 29న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మొదటిగా మియాపూర్ నుంచి అమీర్పేట- నాగోల్ మార్గంలో సేవలను మొదలయ్యాయి. ఆ తర్వాత 5 దశల్లో పూర్తిగా 69.2 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. కారిడార్-1 మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో రెండున్నర లక్షల మంది నిత్యం ప్రయాణిస్తున్నారు. కారిడార్-3 నాగోల్ నుంచి రాయదుర్గంలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications