నిలిచిన హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకలు: ప్రయాణికుల ఇబ్బందులు
హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకలకు బుధవారం సాయంత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం, ప్రయాణికుల రద్దీ కారణంగా మియాపూర్- ఎల్బీనగర్ కారిడార్లో ప్రయాణిస్తున్న రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. పంజాగుట్ట, ఎర్రమంజిల్ స్టేషన్లలో కొద్దిసేపు మెట్రో రైళ్లను నిలిపివేశారు. సాంకేతిక కారణంతో మెట్రో రైళ్లను ఆపినట్లు లోకో పైలట్లు ప్రకటించారు.
మెట్రో రైళ్లు ఆగిపోవడంతో ఉక్కపోత భరించలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేగాక, ఎర్రమంజిల్ స్టేషన్ వద్ద రైలు తలుపులు తెరుచుకోకపోవడంతో పలువురు ప్రయాణికులు అత్యవసర ద్వారం తెరిచి బయటికి వచ్చారు. కాగా, సిటీలో భారీ వర్షం, రహదారిలో ట్రాఫిక్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు.

ఈ క్రమంలో మెట్రో సిబ్బంది హుటాహుటినా ఆ మార్గంలో ఫ్రీక్వెన్సీ పెంచారు. నిమిషానికి రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ కారణంగా ఓ రైలులో తలెత్తిన సాంకేతిక సమస్యతో మిగతా రైళ్లన్నీ నెమ్మదిగా కదులుతున్నాయి. ఒక్కో స్టేషన్లో 5 నుంచి 10 నిమిషాలు ఆపేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో ఎగ్జిట్ మిషన్లు మొరాయించాయి. దీంతో ప్రయాణికులు బయటకు వెళ్లేందుకు మార్గం లేనందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బయటకి వెళ్లేందుకు తీవ్ర జాప్యంతో కొంత మంది ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మెట్రో యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యను పరిష్కరించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూస్తామని మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications