నైజీరియాలో కారు ప్రమాదం: హైదరాబాద్వాసి మృతి
హైదరాబాద్: నైజీరియాలోని ఈబదన్ నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన మధుసూదన్రెడ్డి అనే వ్యాపారి మృత్యువాత పడ్డాడు. నల్గొండ జిల్లా శేరీల గ్రామానికి చెందిన ఎడ్ల అంజిరెడ్డి, చంద్రకళ దంపతుల కుమారుడైన మధుసూదన్రెడ్డి కుటుంబం హయత్నగర్ డివిజన్లోని వనస్థలిపురం హుడాసాయికాలనీలో నివాసముంటున్నది.
హైదరాబాద్లో డిగ్రీ వరకు చదువుకున్న మధుసూదన్రెడ్డి.. తండ్రి అంజిరెడ్డి నడిపించే బోర్వెల్ వ్యాపారాన్ని గత నాలుగేళ్లుగా నైజీరియాలో నిర్వహిస్తున్నాడు. కాగా, భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ మీటింగ్కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
రోడ్డు పక్కన ఆపివున్న డీజిల్ ట్యాంకర్ను తప్పించబోయి మరోవాహనాన్ని ఢీకొట్టడంతో ఆయన ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో మధుసూదన్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అంజిరెడ్డి, చంద్రకళ దంపతులకు పెద్దకుమారుడు మధుసూదన్రెడ్డి కాగా, కుమార్తె శ్వేత అమెరికాలో ఉంటోంది. మధుసూదన్ రెడ్డి మృతదేహం వచ్చిన తర్వాత సాహెబ్నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. కాగా, మృతుడు అవివాహితుడు.