మునుగోడు ఫలితాన్ని తేల్చేసిన కోమటిరెడ్డి: టీపీసీసీపై సోనియాకు లేఖ, రేవంత్తో ప్రియాంక ఇలా
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించకపోవడంతో రాష్ట్ర నాయకత్వంపై ఆయన ఆగ్రహం వీడటం లేదు. మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి తాను వెళ్లేది లేదని ఆయన స్పష్టంచేశారు. కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

మునుగోడులో ప్రచారం చేయనంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మునుగోడు ప్రచారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. మునుగోడుపై ప్రియాంక గాంధీతో జరిగిన రాష్ట్ర నేతల సమావేశానికి ఆయన హాజరుకాకపోవడం గమనార్హం.

మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదన్న కోమటిరెడ్డి
శంషాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టీపీసీసీ చీఫ్, రాష్ట్ర పార్టీ తీరు, కొంత మంది నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్లో మాదిరిగా మునుగోడులో కూడా కాంగ్రెస్ 3-4 వేలు ఓట్లు తెచ్చుకుంటుందన్నారు. 30 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నప్పటికీ తనకు పార్టీ గుర్తింపునివ్వలేదన్నారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చి పీసీసీని చేశారన్నారు.

రేవంత్ రెడ్డిని మార్చాలంటూ సోనియాకు కోమటిరెడ్డి లేఖ
ఈ విషయంలో అభిప్రాయాలు తీసుకున్నట్లు మాణికం ఠాగూర్ నాటకాలు ఆడారన్నారు. పార్టీని సర్వనాశనం చేసి.. పార్టీని నమ్ముకున్న నాలాంటి కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మాణికం ఠాగూర్కు అనుభవం లేదని, కమల్ నాథ్ లాంటి అనుభవం కలిగిన వ్యక్తిని రాష్ట్ర ఇంఛార్జీగా నియమించాలన్నారు.
తిరిగి అభిప్రాయ సేకరణ చేసి కొత్త పీసీసీని ఎంపిక చేయాలన్నారు. తాను పార్టీని వీడి వెళ్లేది లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. టీపీసీసీ మార్పుపై కోమటిరెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ కూడా రాసినట్లు తెలిసింది. రేవంత్ ప్రోత్సాహంతోనే తనపై అద్దంకి దయాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇప్పటికే కోమటిరెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసందే.

కోమటిరెడ్డిని కలుపుకుపోండి: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం
సోమవారం ప్రియాంక గాంధీని కలిశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు. మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిపై చర్చ జరిగింది. అయితే, పార్టీలో అందరినీ కలుపుకుపోవాలని ప్రియాంక గాంధీ నేతలకు స్పష్టం చేశారు. ముఖ్యంగా సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డితో చర్చించి మునుగోడు అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మిగితా సీనియర్లను కూడా కలుపుకుపోవాలన్నారు. పార్టీ ఓడిపోతే తమతోపాటు మీకు కూడా నష్టమేనని తెలంగాణ నేతలకు ప్రియాంక గాంధీ చెప్పినట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీ నేతలు కలుస్తారని, మధుయాష్కీ, దామోదర్ చర్చలు జరుపుతారని రేవంత్ రెడ్డి చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలో సీనియర్ నేత అని, ఆయన అసంతృప్తికి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.












Click it and Unblock the Notifications