రిజైన్ చేస్తా: డెవలప్ చేయండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అభివృద్ది చేస్తే.. తన పదవీకి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అంతేకాదు మళ్లీ పోటీ కూడా చేయనని స్పష్టంచేశారు. తన నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యం అని చెప్పారు. సంక్షేమం ఇంపార్టెంట్ అని.. తర్వాతే పదవులు అని ఇండికేషన్స్ ఇచ్చారు. ఇవాళ చౌటుప్పల్ మండలంలో కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ మీటింగ్లో వెంకట్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు.
భువనగిరి పార్లమెంట్ స్థానంలో రోడ్లు, పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయమని, కావాలంటే బాండ్ రాసి ఇస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీఆర్ఎస్ పాలనలో వివిధ పనులకు సంబంధించి.. కాంట్రాక్టర్లకు రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. దీంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి సంబంధించిన పనులు అంటేనే.. ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. మూసి ప్రక్షాళన కోసం పార్లమెంట్లో మాట్లాడతానని అన్నారు. హిట్లర్ బతికుంటే.. కేసీఆర్ను చూసి ఏడ్చేవాడని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రొటోకాల్ కూడా ఇవ్వడం లేదన్నారు. దళితులకు క్యాబినెట్లో స్థానం లేదని.. దళిత బంధు పేరుతో మోసం చేయడం సీఎం కేసీఆర్కు బాగా తెలుసని చెప్పారు. ఎంపీ స్థానంలో ఉంటూ.. రెండేళ్ల నుంచి అపాయింట్మెంట్ అడిగితే ఇంతవరకు దిక్కేలేదని పేర్కొన్నారు.
కోమటిరెడ్డి కామెంట్స్ చర్చకు దారితీశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. డెవలప్ మెంట్ లేదని చెప్పారు. ఏవో సాకులు చెప్పి.. తప్పించుకోవడం సరికాదన్నారు. ఇప్పటికే హుజురాబాద్ బై పోల్ జరగనుంది. ఇప్పుడు అభివృద్ది పేరుతో మరో సవాల్ వచ్చింది. ఇప్పటికే చాలా మంది నేతలు రిజైన్ చేస్తామని రూ.2 వేల కోట్లు కేటాయించాలని అడుగుతున్నారు. ఆ వరసలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా చేరారు. అయితే తాను మళ్లీ పోటీ చేయనని కొత్తగా సవాల్ విసిరారు.