తెలంగాణకు వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన వాతావరణం నెలకొంటోంది. ఓవైపు ఎండలు మండిస్తుంటే, మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. మరో రెండురోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములుతో వానలు పడతాయని తెలిపింది. తమిళనాడులో ఏర్పడిన ద్రోణి రెండు తెలుగు రాష్ట్రాలపై బలంగా విస్తరించినట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, అసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జనగాం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు.

రాష్ట్రంలో నిన్నా మొన్నటి వరకు భానుడు ఉగ్రరూపం దాల్చడంతో మలమల మాడిపోయిన ప్రజలు ఈ వర్షాలతో ఉపశమనం పొందారు. ఎండవేడికి, తీవ్ర వడగాడ్పులకు, ఉక్కపోతకు తట్టుకోలేక ముఖ్యమైన పనులున్నప్పటికీ వాయిదా వేసుకున్నారు. అత్యవసరమైతేనే బయటకు వచ్చేవారు. రెండు రోజులుగా వాతావరణం చల్లబడటం, రాష్ట్రవ్యాప్తంగా వానలు కురుస్తుండటంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. అకాల వర్షంతో రైతులకు భారీగా పంటనష్టం వాటిల్లింది. కల్లాల్లోని వరిధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారమే కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఊరట పొందుతున్నారు. ప్రస్తుతం వాతావరణం కాస్తంత చల్లగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ఎండ వేడిమి తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని, ప్రజలు ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటలకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications