డబ్బు తెస్తే, ఖర్చు పెడ్తా: తలసానితో పోచారం, చైన్ స్నాచింగ్లపై మండలిలో రభస
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్ రెడ్డిల మధ్య బుధవారం నాడు ఆసక్తికర సంభాషణ సాగింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వీరిద్దరూ తారసపడ్డారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.... వాణిజ్య శాఖా మంత్రిగా తలసాని డబ్బులు వసూలు చేసి తనకివ్వాలన్నారు.
తలసాని డబ్బు తెచ్చిస్తే, తాను వ్యవసాయం, రైతుల కోసం ఖర్చు చేసి ప్రజలకు అవసరమైన ఆహారం, బట్టలను సమకూర్చుతానన్నారు. అనంతరం తిరిగి పన్నుల రూపంలో మీ శాఖకే డబ్బు జమ చేస్తామని, తిరిగి దాన్ని మళ్లీ తమకే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దానికి తలసాని.. సరే అంటూ తలూపారు.
అప్పుల కుప్ప చేస్తున్నారు: గుత్తా
తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని చెబుతూ అప్పుల కుప్ప చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదన్నారు.
పండుగల పేరట పబ్బం గడుపుతున్నారన్నారు. ఉద్యమాలతో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీనే ఉద్యమాలను అణచాలనుకోవడం దారుణమన్నారు. రైతుల ఆత్మహత్యలకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించారు.
హైదరాబాద్లో చైన్ స్నాచింగ్లపై మండలిలో రభస
హైదరాబాదులో వరుస చైన్ స్నాచింగుల పైన మండలిలలో రభస జరిగింది. హైదరాబాదులో మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విపక్షాలు మండిపడ్డాయి.
మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నీరుగారిపోయిందని, పేకాటలు ఆడుతున్నారన్నారు. ప్రభాకర్ రావు వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు.
పేకాట క్లబ్లు నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. దేశంలో పేకాట క్లబ్లను మూయించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని, పోలీసు వ్యవస్థపై అనవసరపు మాటలు మాట్లాడి మంటగలపొద్దన్నారు.
పోలీసుల మనోభావాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు దెబ్బతీస్తున్నారని, పోలీసు వ్యవస్థను కించపరిచినా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు తెలంగాణ పోలీసులకు క్షమాపణ చెప్పాలన్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం బాధాకరమన్నారు.
నేరాలను నియంత్రించేందుకు చర్యలు: నాయిని
నగరంలో క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గిందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. నేరాలను నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెట్రోలింగ్ వాహనాల్లో పోలీసులు ఫోన్లలో పేకాట ఆడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు అనడం సరికాదన్నారు.
రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, చేస్తున్నామని, ప్రత్యేక గస్తీ కోసం వాహనాలను ఉంచుతున్నామని, పాత నేరస్తులను కట్టడి చేసేందుకు చట్టాల్లో మార్పులను తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు.
ఇక గతేడాది పోలిస్తే ఈ ఏడాది గొలుసు దొంగతనాలు తక్కువనే అన్నారు.. గొలుసు దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశామని, కరుడుగట్టిన నేరస్తులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామన్నారు. క్రైం రేట్ తగ్గలేదని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు.