ఉగ్ర నిధుల కోసం భార్య నగలమ్మిన హైదరాబాద్ ఐసిస్ ఉగ్రవాది
హైదరాబాద్: హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భీకర దాడులకు పథకం రచించి ఇటీవలే పోలీసులకు దొరికిన ఐదుగురు ఐసిస్ ఉగ్రవాదులకు సంంబధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. జూన్ 29న హైదరాబాద్లోని పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఎన్ఐఏ మొత్తం 11 మంది ఐసిస్ సానుభూతిపరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మతపెద్దల సహకారం: ఐసిస్ ఉగ్రవాదులను ఎలా అరెస్ట్ చేశారంటే
అనంతరం జరిపిన విచారణలో అందులో ఐదుగురికి మాత్రమే ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తేలడంతో ఆ ఐదుగురిని కోర్టులో హాజరుపరిచి మిగిలిన వారిని వదిలేశారు. అనంతరం కోర్టు అనుమతితో ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) అధికారులు 12 రోజులు పాటు కస్టడీకి తీసుకున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఐదుగరు ఉగ్రవాదులు 'కలిప్ ఆఫ్ ఇస్లామిక్ స్టేట్' ప్రమాణాన్ని తీసుకున్న ఈ మెయిల్ను షఫీ ఆర్మర్కు పంపారు. ఈ మెయిల్ కాపీని ఆర్మర్... ఐసీస్ చీఫ్ అబూ బకర్ అల్-బగ్దాదీకి పంపాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
ఈ ఐదుగురిలో ఐసిస్ ఉగ్రవాదానికి మహ్మద్ ఇబ్రహీం బాగా ప్రేరేపితుడయ్యాడు. ఈ క్రమంలోనే ఇబ్రహీం తన భార్య, ఏడాదిన్నర వయసున్న తన కుమారుడితో పాటు సోదరుడు మహమ్మద్ ఇయాజ్తో గ్రీస్ ద్వారా సిరియాకు వెళ్లేందుకు రెండు సార్లు ప్రయత్నించిన విషయాన్ని విచారణలో వెల్లడించాడు.
ఐసిస్ ప్లాన్: 'క్రాస్ ఎగ్జాం' షాక్, ఎలా బుట్టలో వేస్తారు?ఈ కారణం చేతనే మహ్మద్ ఇబ్రహీంతో పాటు అతని సోదరుడు మహమ్మద్ ఇయాజ్ను కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఈ ఐదుగురు ఉగ్రవాదుల్లో ఓ ఉగ్రవాది... హైదరాబాద్ సహా, దేశంలోని ఉగ్రదాడికి సంబంధించి ఖర్చుల కోసం కట్టుకున్న భార్య నగలను కూడా అమ్మేశాడని తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలోని ఏయే పోలీస్ స్టేషన్లను టార్గెట్ చేసుకున్నారో వాటికి సంబంధించి పూర్తి సమాచారం కోసం ఓ యాప్ను కూడా డౌన్ లోడ్ చేసుకున్నారట. సౌదీ అరేబియాలో ఉద్యోగ నిమిత్తం ఇబ్రహీం వెళ్లినప్పుడు అతడిని ఐసిస్ వైపుకు మళ్లేందుకు జోర్డాన్ జాతీయుడు సుహాబీ ఆల్-అబుదీ అనే వ్యక్తి ప్రయత్నించాడని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు.
సౌదీ అరేబియాలో ఇబ్రహీం మూడు సంవత్సరాలు నివసించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జులై 2015లో సౌదీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత గ్రీస్ ద్వారా సిరియాకు వెళ్లేందుకు అతడు వీసాకు కూడా దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలిపారు. నేరుగా టర్కీకి వెళితే అనుమానం వస్తుందనే ఉద్దేశంతోనే అతడు గ్రీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడట.
అయితే గ్రీసు వీసాను నిరాకరించడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన ఇబ్రహీం టర్కీలో ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. టర్కీ నుంచి పాజిటివ్ స్పందన రావడం, ఈ క్రమంలోనే ఎన్ఐఏ అధికారులు అతడిని అరెస్ట్ చేయడం చకా చకా జరిగిపోయాయి.