కెసిఆర్ దీక్ష మర్మాన్ని బయటపెడ్తా, ఊహకందని అసత్యాలు: జైపాల్ రెడ్డి
హైదరాబాద్: ఊహకందని అసత్యాలు, అబద్ధాలతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి జైపాల్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ నిరాహారదీక్ష ఎలా చేశారో అందరికీ తెలుసన్నారు. అసలు కేసీఆర్ దీక్షను ఎందుకు విరమించారో ఇంతవరకూ వివరణ ఇవ్వలేదన్నారు.
ప్రజాసంఘాల ఒత్తిడి మేరకే భయపడి కేసీఆర్ తిరిగి దీక్షను కొనసాగించారని ఆరోపించారు. కేసీఆర్ దీక్ష మర్మాన్ని త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర చాలా ఉందని, తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంపీలను ఏకతాటిపై నడిపించానని ఆయన చెప్పారు. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసివుంటే తెలంగాణ వచ్చేదేకాదని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్రెడ్డి తెలిపారు.
తాను కేంద్రంలో పదవిని అంటిపెట్టుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి బుధవారంనాడు స్పందించారు.
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం వచ్చినప్పటికీ తాను తెలంగాణ రాష్ట్రసాధన కోసం ఆ పదవిని తీసుకోలేదని ఆయన అనఅనారు. వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే కెసిఆర్ విమర్శలకు దిగుతున్నారని ఆయన అన్నారు.

కాంగ్రెసు వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే అవగాహన తెలంగాణ ప్రజలకు ఉందని ఆయన చెప్పారు. ఉద్యమంలో భాగంగానే తాను కేంద్రంలో మంత్రి పదవికి రాజీనామా చేయలేదని, ఒకవేళ తాను రాజీనామా చేసి ఉంటే హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏర్పడి ఉండేది కాదని ఆయన స్పష్టం చేశారు.
"కాంగ్రెస్లో మరో పెద్ద మనిషి.. జైపాల్రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు. సకల జనుల సమ్మె జరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడని అంటున్నాడు. ఏమనాలి? ఉద్యమంలో కేసీఆర్ ఎక్కడున్నడో మీకు తెల్వదా? జైపాల్రెడ్డి ఏడ పండుకున్నడో తెల్వదా? 2004నుంచి 2014వరకు కేంద్రంలో మంత్రిపదవి అనుభవిస్తూ తాను జాతీయవాదిని, ప్రాంతీయవాదిని కాను అని చెప్పిన జైపాల్రెడ్డి, ఇప్పుడు వరంగల్కు వచ్చి కేసీఆర్ ఎక్కడున్నడని మాట్లాడుతాడు. ఇట్ల అబద్ధాలు, అసత్య ప్రచారాలు, వాస్తవాలను వక్రీకరించిన వారికి కర్రుకాల్చి వాతపెట్టండి" అని కెసిఆర్ మంగళవారం సాయంత్రం వరంగల్ ఎన్నికల ప్రచార సభలో అన్నారు.












Click it and Unblock the Notifications