పవన్ కోసం..క్యాన్సర్ తో బాధపడుతూ: ప్రకాశం నుంచి హైదరాబాద్ కు అంబులెన్స్ లో ప్రయాణం!
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను చూడటానికి క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన అభిమాని, కార్యకర్త ఒకరు తన కుటుంబంతో సహా ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ కు అంబులెన్స్ లో ప్రయాణం సాగించారు. తన చివరి రోజుల్లో పవన్ కల్యాణ్ చూసి తీరాలనే ఉద్దేశంతో ఆయన ఈ సాహసానికి పూనుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. తనను చూడటానికి వచ్చిన ఆ అభిమానిని పవన్ కల్యాణ్ పరామర్శించారు.
ఆయన కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. క్యాన్సర్ నుంచి కోలుకోవాలని అభిలాషించిన పవన్ కల్యాణ్.. గణేషుడి ప్రతిమను ఆయనకు ఇచ్చారు. ఆ అభిమాని పేరు పాతపాటి బుడిగయ్య. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యకర్త.

జిల్లాలోని త్రిపురాంతకం మండలం అన్నసముద్రానికి చెందిన బుడిగయ్య పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. కొంతకాలంగా ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారు. కీమో థెరపీ చేయించుకుంటున్నారు. అయినప్పటికీ- ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొంతకాలంగా ఇళ్లు కదలలేని స్థితికి చేరుకున్నారు. పవన్ కల్యాణ్ ను చివరిసారిగా చూడాలనే కోరికను వెల్లడించడంతో పార్టీ జిల్లా నాయకులు ఆయనను అంబులెన్స్ లో హైదరాబాద్ కు తీసుకెళ్లారు.

హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆయనను పరామర్శించారు. లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. అవసరమైతే తాను ఆ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications