ఛానల్ కెమెరామెన్, రెండో భార్య మృతిలో ట్విస్ట్: రహస్యంగా పెళ్లాడాడు
హైదరాబాద్: భాగ్యనగరంలోని వనస్థలిపురంలో ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్.. ఆయన రెండో భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వనస్థలిపురంలో టీవీ కెమెరామెన్ రాజీవ్, ఆయన భార్య కవితలుగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
జర్నలిస్టును రాజీవ్ (రాజు)గా గుర్తించారు. ఆయన భార్యను కవితగా గుర్తించారు. కవిత అతని రెండో భార్య అని తెలుస్తోంది. వీరు ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండ జిల్లా చౌటుప్పల్కు చెందిన రాజుకు (36) అదే జిల్లా బంగారిగడ్డకు చెందిన కవితతో (30) పదో తరగతి చదువుతున్నప్పుడే పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి, రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. రాజు వనస్థలిపురంలో ఉంటూ ఓ టీవీ ఛానల్లో కెమెరామెన్గా పని చేస్తున్నాడు.
కవిత ఓ స్కూల్లో పని చేస్తోంది. రాజుకు ఆరేళ్ల క్రితమే సింధూ అనే మహిళతో వివాహమైంది. వరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కవితను రహస్యంగా పెళ్లి చేసుకున్న రాజు.. నగరంలో ఉంటున్నాడు. ఆదివారం ఇద్దరు గొడవ పడ్డారని, ఆ తర్వాత మంచినీళ్లు వచ్చాయని పిలిచినా బయటకు రాలేదని ఇంటి యజమాని చెప్పారు.
మంగళవారం నాడు ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. పోలీసులు లోపలకు వెళ్లి చూస్తే ఇద్దరూ సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకొని మృతి చెందారు. కాగా రాజు ఎక్స్ప్రెస్ టీవీలో కెమెరామెన్గా పని చేస్తున్నాడని తెలుస్తోంది.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, వనస్థలిపురం మాట్లాడుతూ.. తాము తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లామని, లోపల ఇద్దరు సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారని చెప్పారు. వారిద్దరు వేర్వేరు గదుల్లో ఉరేసుకున్నట్లు గుర్తించారు.