నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు: చంద్రబాబుపై కవిత, లోకేష్కు చురకలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మాటలు వింటుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాట్లాడే మాటలు ఆయనకైనా అర్థమవుతున్నాయే లేదో తెలియడం లేదని ఆమె అననారు.
ఎపి చంద్రబాబు హైటెక్సిటీ కట్టారు గానీ పేదల బస్తీలను పట్టించుకోలేదని కవిత ఆరోపించారు. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆమె శనివారంనాడు పరిశీలించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన గురించి తానే చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ నేత లోకేష్ గల్లీ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రజలందరిని కలుపుకెళ్తుంటే టీడీపీ ఓట్ల కోసం ప్రజలను విడగొడుతోందని కవిత మండిపడ్డారు. రోహిత్ మరణాన్ని రాజకీయం చేయొద్దని ఆమె హితవుపలికారు.
అవసరమైతే ఎన్నికల తర్వాత రోహిత్ మరణంపై స్పందిస్తామన్నారు. ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నామని కవిత తెలిపారు.హైదరాబాద్ సమస్యలను పరిష్కరించడానికి కెసిఆర్ వంటి నాయకుడు కావాలని ఆయన అన్నారు. తమ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే హైదరాబాద్ దశను మార్చి చూపిస్తామని ఆమె అన్నారు.