జయసుధ కొడుకు 'బస్తీ' ఫంక్షన్లో కేసీఆర్: టీడీపీకి కర్నె కౌంటర్
హైదరాబాద్: సినిమా పరిశ్రమను తెలుగుదేశం పార్టీ తమ ఇంటి సంస్థగా భావిస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సోమవారం మండిపడ్డారు. ఏ పరిశ్రమ ఎవరి సొత్తు కాదన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి పనులు కనిపించడంలేదన్నారు.
హైదరాబాద్ను నెంబర్ వన్గా తీర్చి దిద్దాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కృషి చేస్తుంటే అనవసర రాద్ధాంత చేస్తున్నారన్నారు. టీడీపీ పాలనలోనే హైదరాబాద్ చెత్త నగరంగా మారిందన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేస్తుంటే ఎన్నికల కోసమే చేస్తున్నారని చెప్పడం విడ్డూరమన్నారు.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ? ఏం ఎన్నికలు ఉన్నాయో చెప్పాలన్నారు. టీడీపీ నేతలకు అజ్ఞానం మూర్తీభవించిందన్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని మాట్లాడాలన్నారు. తెలంగాణలో టీడీపీ ప్రతిష్ట మసకబారిందన్నారు.
తెలంగాణ టీడీపీ నేతలు తెలంగాణ బిడ్డలే అయితే తెలంగాణ అభివృద్ధికి అనుకూలంగా మాట్లాడాలన్నారు. కొందరికే చుట్టంగా మారిన సినిమా పరిశ్రమ అందరికి చెందాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఆదివారం నాడు ఆడియో ఫంక్షన్కు వెళ్లారన్నారు.
ఫిలింనగర్-2ను నిర్మిస్తున్నామని చెప్పడంతో టీడీపీ భయపడుతోందన్నారు. కాగా, ప్రపంచమంతా యోగా చేస్తుంటే కేసీఆర్ ఆదివారం నాడు జయసుధ తనయుడి ఆడియో ఫంక్షన్కు వెళ్లడాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.