చక్రం తిప్పిన కవిత: మారిన అభ్యర్థులు, రాజ్యసభకు డిఎస్?
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తనయ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఆమె ప్రయత్నం కారణంగా టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు మారిపోయారని అంటున్నారు.
దామోదరరావు, కెప్టెన్ లక్ష్మీకాంత రావులను రాజ్యసభకు పంపించాలని కెసిఆర్ భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, కవిత ప్రయత్నం కారణంగా సీనియర్ నేత డి. శ్రీనివాస్ను రాజ్యసభకు పంపించాలనే నిర్ణయానికి కెసిఆర్ వచ్చినట్లు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ను రాజ్యసభకు పంపిస్తే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తనకు ఎదురు ఉండదనే ఉద్దేశంతో కవిత చక్రం తిప్పినట్లు చెబుతున్నారు.
డిఎస్ రాజ్యసభకు ఎన్నికైతే నిజమామాబాద్ లోకసభ స్థానంలో తనకు సహకరిస్తారనేది, తనకు పోటీ ఉండదనేది కవిత ఎత్తుగడగా చెబుతున్నారు. అంతేకాకుండా 32 ఏళ్ల సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన ఓ బిసీకి ప్రాధాన్యం ఇచ్చినట్లువుతుందని కూడా కెసిఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఐదుగురు సీనియర్ నేతలు రాజ్యసభ స్థానాల కోసం పోటీ పడుతున్నారు. కాగా, రెండు స్థానాలు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవిత పట్టుబట్టి డిఎస్ను ఎంపిక చేయించినట్లు చెబుతున్నారు. డిఎస్ ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా ఉన్నారు. డిఎస్ ఎంపికపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాలున్నాయి.
ఈ నెల 24వ తేదీన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్కు ముందే టిఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. డిఎస్ ఢిల్లీలో ఉంటూ పార్టీకి మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని కవిత గత రెండు రోజులుగా కెసిఆర్ను ఒప్పించే ప్రయత్నం చేశారని అంటున్నారు.












Click it and Unblock the Notifications