బుక్ కల్చర్ నుంచి లుక్ కల్చర్, తెలుగులో ఐపాడ్ చేరిస్తే: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: బుక్ కల్చర్ నుండి లుక్ కల్చర్కు యువతం వచ్చింది. కాని ఐపాడ్ను వదలడం లేదు..ఐపాడ్లో తెలుగును చేర్చగలిగితే మంచి ఫలితాలుంటాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు.
గురువారం హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలోతెలంగాణ ప్రచురణ సంస్థ ప్రచురించిన 28 పుస్తకాలను ఆమె ఆవిష్కరించి ప్రసంగించారు. శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన సభకు సినీ దర్శకుడు బి. నరసింగరావు అధ్యక్షత వహించారు.
ఆ బాధ్యత సంస్థలకు ఉంది...
సాహిత్యాన్ని రేపటి తరానికి అందించే బాధ్యత సాహితీ సంస్థలతో పాటు ప్రభుత్వంపైనా ఉంటుందని కల్వకుంట్ల కవిత అన్నారు.తెలంగాణ సాహితీ వికాసానికి ప్రపంచ తెలుగు మహాసభలు దోహదపడుతాయని ఆమె అన్నారు. మన సాహితీ మూర్తులను ప్రపంచానికి తెలియజేయాలని ఉద్యమ టైంలో అనుకున్నామని, ఇప్పుడు ఒకే సారి 25 పుస్తకాలు ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
కెసిఆర్ ఓ విజన్తో ఉన్నారు.
తెలంగాణ ప్రచురణ సంస్థ బాధ్యులు,బి. నరసింగరావు, డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్ కె. ప్రతాప్ రెడ్డిలను కవిత అభినందించారు. తెలుగు సాహిత్యం పరిపుష్టం చేయడానికి, సుసంపన్నం చేయడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక విజన్తో ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే 1-12 తరగతుల వరకు తెలుగును తప్పని సరి చేసిందని, సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసి దాని ద్వారానే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహింప చేస్తున్నారన్నారు.
తొవ్వలేసింది తెలంగాణనే..
తెలుగులో అన్ని సాహిత్య ప్రక్రియకలు తొవ్వలేసింది తెలంగాణనే అని కవిత అన్నారు. మన వైతాళికులను, వారి సాహిత్యం గొప్పదనాన్నిచర్చించుకుంటూనే భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకునేందుకు తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారని ఆమె చెప్పారు. తెలుగు భాషాభిమానులు, మేధావులు సభల్లో పాల్గొని ప్రభుత్వానికి తెలుగు భాషాభివృద్ధి కోసం చేయాల్సిన పనుల గురించి తెలియజేయాలని ఆమె కోరారు.
ఇబ్బందులుంటాయి, కానీ...
పుస్తక ప్రచురణలో ఇబ్బందులుంటాయని, అయితే ఆ పుస్తకం ప్రభావం చాలా ఏళ్లు సమాజంపై ఉంటుందని కవిత అన్నారు. సమకాలీన విషయాలపై చదివే సంస్కృతి తగ్గుతున్న ఈ రోజుల్లో తెలంగాణ సాహిత్యాన్ని పిల్లలకు ఎలా అందించాలని ఆలోచించాలన్నారు. ముందు తరాలకు అందజేయడం ఎలా.అనే అనేది కూడా చర్చించాలన్నారు. డిజిటల్ ఏరియాలో తెలుగు పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాల్సి ఉందన్నారు. కిండెల్లో ఇంగ్లీష్ సాహిత్యం ఎక్కువగా ఉందని చెప్తూ తెలుగు పుస్తకాలు కిండెల్లో అందుబాటులోకి తేవాలని సూచించారు.
ఆ విషయం మనకు తెలుసు.
తెలుగు పేరిట రాష్ట్రాన్ని కలుపుకుని వివక్ష చూపిన నేపథ్యం మనకు తెలుసు...ఉద్యమ సందర్భంలో వివక్షపై ఎలుగెత్తి చాటాం..రాష్ట్రాన్ని సాధించుకున్నాం.తెలుగు సాహితీ వికాసంపై దృష్టిసారించాల్సిన తరుణం ఇది అని కవిత అన్నాు. 70వ దశకంలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో సాగాలని ఉత్తర్వులు వచ్చాయంటున్నారు. గత ప్రభుత్వాలు తెలుగును పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన, కోర్టు తీర్పులు తెలుగులో రావాలంటున్నారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తే..సరైన బ్యాక్గ్రౌండ్ వర్క్ జరగలేదన్నారు.
ట్రైన్ను రైల్ అంటున్నాం..తెలుగులో ధూమ శకటం అంటే బాగుంటుందా...అర్థం అవుతుందా...పొగరాని రైల్లు కూడా నడుస్తున్న పరిస్థితుల్లో ఏ పదం వాడాలి... తమిళంలో పాయింట్ కు కూడా పదం ఉంది...మనం తెలుగులోనూ పాయింట్ అని చదువుతున్నాం..మాట్లాడుతున్నాం..అని కవిత తెలిపారు.
మనం ఏం చేయాలో ఆలోచించాలి...
ప్రభుత్వ ఉత్తర్వులు, కోర్టు తీర్పులు తెలుగు భాషలో తీర్పులు రావాలంటే ఏం చేయాలనేది మేధావులు సూచించాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. నేమ్ ప్లేట్లు తెలుగులో ఉండాలంటే అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయని, ఇది సాధ్యమవుతుందా..అని కొందరు అంటున్నారని కవిత చెప్తూ ప్రజల సహకారం ఉంటే సాధించనిది ఏదీ లేదన్నారు.
చానెల్స్లో తెలుగు వాడకం తక్కువ
తెలుగు ఛానల్స్లలో తెలుగు భాష వాడకం తక్కువగా ఉందని, ఇన్ఫార్మల్గానే వార్తలు ప్రసారం అవుతున్నాయని కవిత అన్నారు. మనం మాట్లాడుతూన్నట్లుగానే సగం తెలుగు, సగం ఇంగ్లీష్ లో తెలుగు ఛానల్స్ వార్తలను ప్రసారం చేస్తున్నాయన్నారు. ఫార్మల్ న్యూస్ స్ట్రక్చర్ రావాలని కవిత అభిలషించారు. తెలుగు దిన పత్రికలు ఫార్మల్ లాంగ్వేజ్లో ముందున్నప్పటికీ హెడ్డింగ్ల విషయంలో అప్పుడప్పుడూ ఇన్ ఫార్మల్ విధానాన్ని అవలంభిస్తున్నాయని చెప్పారు. 5 రోజుల పాటు జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో సాహితీఅభిమానులు, మేధావులు పాల్గొనాలని ఎంపి కవిత కోరారు.
వారంతా పాల్గొన్నారు...
ఈ కార్యకమంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ గంటా చక్రపాణి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, డాక్టర్ రవ్వా శ్రీహరి, తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఛైర్మన్ ఎం. వేదకుమార్, అమ్మంగి వేణుగోపాల్ పాల్గొన్నారు.