జగన్తో కేసీఆర్ రాజీపడ్డారా..? ఎందుకు నోరుమెదపడం లేదు: ఉత్తమ్
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిపై అనుమానం కలుగుతోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. లాక్ డౌన్ వేళ ఏపీ సీఎం జగన్తో చీకటి ఒప్పందం చేసుకున్నారా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర మాట విని తుమ్మడిహెట్టి కాదని.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని.. తుమ్మడిహెట్టి ద్వారా కమీషన్లు రావు అని తెలిసి కాదనుకున్నారా అని అడిగారు. కేసీఆర్ అసమర్ధతతో మెలుగుతున్నారా..? లేదంటే జగన్తో కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు స్లోగన్తో అధికారం చేపట్టిన కేసీఆర్.. ఇప్పుడు మౌనమునిగా ఎందుకు మారారు అని అడిగారు. రెండు టీఎంసీల కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్లు ఖర్చు పెడుతున్న కేసీఆర్.. శ్రీశైలం నుంచి రోజు మూడు టీఎంసీల నీటిని అదనంగా తీసుకెళ్లేందుకు ఏపీ ప్రయత్నిస్తుంటే ఎందుకు ఆపడం లేదు అని అడిగారు. శ్రీశైలం నుంచి 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడుకు తరలిస్తే మన రాష్ట్ర రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.
ఎన్నికల తరువాత జగన్, కేసీఆర్ క్లోజ్ అయ్యారని, గతేడాది మూడు సార్లు కలిసారని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడు నుంచి అదనపు నీళ్ళు తీసుకొవద్దని జగన్కు ఎందుకు చెప్పడం లేదన్నారు. దీంతో తమకు అనుమానం కలుగుతుందని చెప్పారు.