ఏపీలో సమస్యల్లేవా.. వేళ్లాడుతున్నావ్: బాబుపై కెసిఆర్, రేవంత్ ఇష్యూపై..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరు మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్లుగా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. డీ శ్రీనివాస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఓటుకు నోటు కేసులో మనం ఏం చేయలేదని, దొంగతనం చేస్తుంటే పట్టుకున్నామని చెప్పారు. ఆంధ్రా - తెలంగాణ పొత్తులో డబ్బులు వస్తే వాటిని ఆంధ్రా అకౌంటులో వేసుకుంటున్నారని ఆరోపించారు. సీమాంధ్రలో 13 జిల్లాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసుకోవచ్చు కదా అన్నారు.
ఆంధ్ర ప్రాంతంలో కష్టాలు లేవా, సమస్యలు లేవా అని చంద్రబాబును ప్రశ్నించారు. వాళ్ల జాగాలో వాళ్లుండక హైదరాబాదును పట్టుకొని వేళ్లాడటం ఏమిటన్నారు. సమైక్య ఏపీలో సాగిచ్చుకునేంత సాగిచ్చుకున్నారని, ఇకనైనా మా మానాన మమ్మల్ని బతకనివ్వాలన్నారు.

తెలంగాణ ఏడాది బిడ్డ అని, బొండిగ పిసికి చంపాలనుకుంటున్నారన్నారు. తనకు మద్దతిచ్చేందుకు వచ్చిన డీఎస్కు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. హైదరాబాదులో మత ఘర్షణలు సృష్టించింది కొందరు దుర్మార్గులు అన్నారు. అంతకుముందు ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు.
ముస్లీంలు, హిందువులు గంగా, జమున నదుల్లా మెలిగారన్నారు. మధ్యలో వచ్చిన వాళ్లకు మన సంప్రదాయాలు తెలియవన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అనే భావనతో డీఎస్ వచ్చారన్నారు. డీఎస్ చేరికను పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా అందరూ స్వాగతించారన్నారు.
టీఆర్ఎస్ బలోపేతం అంటే తెలంగాణ బలోపేతం అవుతున్నట్లేనని చెప్పారు. అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. పట్టుదలతో పని చేసుకుంటూ పోయి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చి టీఆర్ఎస్ను గెలిపించారన్నారు.
ఎవరు టీఆర్ఎస్లో చేరినా చిల్లరమల్లర రాజకీయంగా తీసుకోనని చెప్పారు. డీ శ్రీనివాస్ వంటి వ్యక్తికి పదవులు ఓ లెక్క కాదన్నారు. డీఎస్తో తనకు 35 ఏళ్ల అనుబంధముందని చెప్పారు. ఏపీతో పంచాయతీ ఇంకా తెగలేదన్నారు. అరుగుల పైన కూర్చొని అలకగా మాట్లాడొచ్చు.. కానీ మోస్తే బరువు తెలుస్తుందన్నారు.












Click it and Unblock the Notifications